Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు తమ ప్లేయర్లకు షేక్హ్యాండ్ ఇవ్వకపోవడంపై పాకిస్థాన్ తెగ ఫీలవుతోంది. క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించిన భారత ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్కు ఫిర్యాదు చేశామని, కానీ ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెబుతోంది. ఆసియా కప్లో యూఏఈతో జరగనున్న తదుపరి మ్యాచ్కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా ఖరారయ్యారు. దీంతో, ఆయనను గాని పక్కనపెట్టకుంటే ఆ మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని పాకిస్థాన్ (Pakistan) భావిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి.
యుఏఈతో మంగళవారం ఆడాల్సిన మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ పాకిస్థాన్ హెచ్చరిస్తోందని ‘క్రిక్బజ్’ కథనం పేర్కొంది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను టోర్నమెంట్ నుంచి తొలగించాలంటూ ఆ జట్టు డిమాండ్ చేస్తోందని, లేకుంటే యూఏఈతో మ్యాచ్ ఆడకూడదని భావిస్తున్నట్టు తెలిపింది. కాగా, ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వేకి చెందినవారు.
షేక్హ్యాండ్ ఇవ్వనందుకు పాక్ అసహనం
ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వివాదం చోటుచేసుకుంది. భారత్ విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే ఇద్దరూ పాక్ ఆటగాళ్లకు షేక్హ్యాండ్ ఇవ్వకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిపోయారు. టాస్ సమయంలో కూడా పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో సూర్య షేక్హ్యాండ్ చేయలేదు. భారత ప్లేయర్లు ఈ విధంగా వ్యవహరించడాన్ని పాకిస్థాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది.
భారత ఆటగాళ్లపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తొలుత మ్యాచ్ రిఫరీగా ఉన్న ఆండీ పైక్రాఫ్ట్కి ఫిర్యాదు చేసింది. కానీ, ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పీసీబీ ఆరోపిస్తోంది. అందుకే, ఆయనను టోర్నమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు తమ డిమాండ్ను తెలియజేస్తూ ఆసియన్ క్రికెట్ కౌన్సిల్కి (ACC) లేఖ కూడా రాసినట్టుగా సమాచారం.
Read Also- Jharkhand Encounter: మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ.. అగ్రనేత హతం.. మరో ఇద్దరు కీలక నేతలు సైతం?
ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీ చీఫ్
ఆసియా కప్తో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ, భారత్-పాక్ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. మొహ్సిన్ నక్వీ ప్రస్తుతం ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆసియా కప్ నిర్వహణలో ఐసీసీకి సంబంధం లేకపోయినా, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. నక్వీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘‘మ్యాచ్ రిఫరీ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని (Code of Conduct), ఎంసీసీ నిబంధనలలోని క్రీడా స్ఫూర్తి నిబంధలను ఉల్లంఘించారు. అందుకే ఆండీ ప్రైక్రాఫ్ట్ను ఆసియా కప్ నుంచి తక్షణమే తొలగించాలంటూ ఐసీసీని పీసీబీ డిమాండ్ చేసింది’’ అని అన్నారు.
కాగా, మ్యాచ్ ముగిసిన తర్వాత హ్యాండ్షేక్ లేదనే విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం పాకిస్థాన్ ఆటగాళ్లకు తెలియజేయడాన్ని మ్యాచ్ రిఫరీ ఆండీ ప్రైక్రాఫ్ట్ మరచిపోయినట్టుగా తెలుస్తోంది. తన పొరపాటుకుగానూ పాక్ ఆటగాళ్లకు ఆయన క్షమాపణలు కూడా చెప్పినట్టుగా సమాచారం.
Read Also- US Corn Threat: మరోసారి అమెరికా బెదిరింపులు.. భారత్ మా మొక్కజొన్న కొనకుంటే…