Ind vs Pak Match: ఆసియా కప్-2025లో భాగంగా భారత్-పాక్ జట్ల (Ind vs Pak Match) మధ్య మ్యాచ్ చాలా ఉద్వేగపూరితమైన వాతావరణంలో జరగబోతోంది. ఈ భావోద్వేగాలను గమనించిన దుబాయ్ పోలీసులు మ్యాచ్ జరిగే స్టేడియంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా స్టేడియంలో భద్రతను ఏకంగా మూడు రెట్లు పెంచాలని స్థానిక పోలీసు అధికారులు నిర్ణయించారు.
జెండాలు, పోస్టర్లకు నో ఛాన్స్
స్టేడియం లోపలికి పోస్టర్లు గానీ, జెండాలు గానీ తీసుకెళ్లడానికి అనుమతి లేదని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. సెల్ఫీ స్టిక్స్, పెద్ద కెమెరాలు, ఫైర్వర్క్స్ వంటివి తీసుకెళ్లడానికి అస్సలు ఛాన్స్ ఉండదని చెప్పారు. ఈ విషయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్టేడియంలో ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం ఉండవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో, ఎలాంటి వాటికీ ఆస్కారం ఇవ్వకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆదివారం ఉదయం నుంచే స్టేడియం పరిసరాల్లో భద్రతా తనిఖీలు మొదలయ్యాయి. ఇతర మ్యాచులతో పోలిస్తే ఈ మ్యాచ్కు భద్రతను మూడు రెట్లు ఎక్కువ భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎలాంటి చిన్న తప్పు కూడా జరగనివ్వకూడదని పోలీసులు భావిస్తున్నారు.
రూల్స్ అతిక్రమిస్తే రూ.7 లక్షల వరకు జరిమానా
భారత్–పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. దుబాయ్ పోలీస్ అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ ఫర్ ఆపరేషన్స్, మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూఈ మాట్లాడుతూ, ఈ మ్యాచ్కు ప్రత్యేక భద్రతా విభాగాలను నియమించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానులకు ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. స్టేడియంలో హింసాత్మక ప్రవర్తనను సహించబోమన్నారు. వస్తువులను విసరడం, దూషణలకు దిగడం వంటి చర్యలకు పాల్పడితే రూ.7 లక్షలకుపైగా జరిమానా ఉంటుందన్నారు. జైలుశిక్ష కూడా పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మ్యాచ్కు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో, చిన్న పొరపాటు జరిగినా ఊహించలేని పరిస్థితిని తెచ్చిపెడుతుందని, అందుకే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్ అమలులో ఉంచినట్టు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు.
Read Also- Ind vs Pak Match: పాకిస్థాన్తో మ్యాచ్లో నిరసనకు సిద్ధమవుతున్న టీమిండియా ప్లేయర్లు!
ఒక అధికారి మాట్లాడుతూ, దుబాయ్ ఒక అంతర్జాతీయ క్రీడా వేదిక అని, ఇప్పటికే అనేక హైప్రొఫైల్ ఈవెంట్స్ నిర్వహించామని ప్రస్తావించారు. ఇక్కడికి వచ్చే ప్రతి ప్రేక్షకుడి, ప్రతి ఆటగాడి భద్రతకు తాము బాధ్యత వహిస్తామని చెప్పారు. అందుకే, భద్రత విషయంలో ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టబోమని, ప్రస్తుత పరిస్థితి సాధారణం కాదనే విషయం తమకు తెలుసనని అన్నారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
స్టేడియంలోకి వీటిని తీసుకెళ్లొద్దు..
జాతీయ జెండాలు, బ్యానర్లు, పెద్ద కెమెరాలు, సెల్ఫీ స్టిక్స్, గొడుగులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, పదునైన వస్తువులను స్టేడియంలో తీసుకెళ్లడానికి అనుమతి లేదని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ నిషేధిత వస్తువులను ఫ్యాన్స్ వద్ద ఉంటే భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని, రూ.1 లక్ష నుంచి రూ.7 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అంతేకాదు, భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. స్నిఫర్ డాగ్స్, మౌంటెడ్ పోలీసింగ్ వంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు దుబాయ్ పోలీసు అధికారులు వెల్లడించారు.
Read Also- Taliban leader: విరాట్ కోహ్లీకి తాలిబన్ లీడర్ స్పెషల్ రిక్వెస్ట్.. ఏం కోరాడంటే?