Hyderabad: విద్య ఇప్పుడు వ్యాపారంగా మారింది. తల్లిదండ్రుల ఆశను, విద్యార్థుల భవిష్యత్తు కోసం పడే తపనను ఆసరాగా చేసుకుని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యం నగదు దోపిడీకి పాల్పడుతున్నాయి. పనిచేసే పనికి, చదివే చదువుకు పొంతన లేకపోయినా, ఎలాగైనా డిగ్రీ పట్టా సంపాదించాలనే విద్యార్థుల బలహీనతను ఈ కళాశాలలు అడ్డాగా మార్చుకుంటున్నాయి. హైదరాబాద్ (Hyderabad)లో ఇలాంటి వ్యాపార ధోరణి ఉన్న కళాశాలల్లో ఒకటిగా నిలిచిన సన్డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ‘డబ్బులిచ్చుకో.. సర్టిఫికేట్ తీసుకో’ అనే గలీజ్ దందా తాజాగా బయటపడింది.
ఓయూకు విరుద్ధంగా
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) అనుమతితో నడుస్తున్న ఈ కళాశాల, ఓయూ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఓయూ ఆడిట్సెల్ అధికారులు కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా అక్రమాలు వెలుగు చూశాయి. గ్రేటర్ హైదరాబాద్లోని రాంనగర్, మియాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో నడుస్తున్న ఈ కళాశాల, ఓయూ గుర్తింపుతోనే ఢిల్లీకి చెందిన లింగయ్య విద్యాపీఠ్కు సంబంధించిన కోర్సులను సైతం అదే భవనంలో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
తలలు పట్టుకున్నారు!
ఓయూ పరిధిలోని కళాశాలలు ఇతర యూనివర్సిటీ కోర్సులను నడిపించకూడదనే 2020 సర్క్యూలర్కు ఇది పూర్తి వ్యతిరేకం. ఒకే భవనంలో ఇరు యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులు కొనసాగే అవకాశం లేకపోయినా, సన్ డిగ్రీ కళాశాల యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించింది. తనిఖీకి వెళ్లిన ప్రొఫెసర్ కిషన్.. ఓయూ విద్యార్థుల కంటే ఇతర యూనివర్సిటీ విద్యార్థుల సంఖ్యే అత్యధికంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఓయూ కోర్సులకు, ఢిల్లీ యూనివర్సిటీ కోర్సులకు సంబంధం ఏంటని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కళాశాల యాజమాన్యానికి నోటీసులు
తనిఖీల్లో కనిపించిన ప్రతి అంశాన్ని వీడియో ఆధారంగా రికార్డు చేసి, వీసీకి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యానికి నోటీసులు కూడా జారీ చేశారు. ఓయూ నిబంధనల ప్రకారం ఇతర యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సులను, కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తే రూ.5 లక్షల జరిమానా విధించాలి, తక్షణమే గుర్తింపు రద్దు చేసి, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలి. ఈ సందర్భంగా సీజేఎస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, తనిఖీల్లో పక్కా సమాచారం దొరికినందున, ఓయూ అధికారులు తక్షణమే కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు వ్యవహరిస్తే, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
