Indian Railways: భారతీయ రైల్వే కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఈ రూల్ ను అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్నట్లు రైల్వేశాఖ స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం రిజర్వేషన్ టికెట్లు విడుదలైన తొలి 15 నిమిషాలు.. ఆధార్ ధ్రువీకరించిన ఐఆర్సీటీసీ ఖాతాతోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లింకప్ చేయని ఖాతాలతో టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుపడదు. ఇప్పటివరకూ ఈ విధానం తత్కాల్ టికెట్ బుకింగ్ కు మాత్రమే ఉంది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో వచ్చే నెల నుంచి సాధారణ టికెట్లకు సైతం వర్తించనుంది. తప్పుడు బుకింగ్స్ ను తగ్గించడంతో పాటు నిజమైన ప్రయాణికులకు న్యాయంగా టికెట్లు అందించడం కోసం ఈ నిబంధన తీసుకొస్తున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
కొత్త నిబంధన ఎలా పని చేస్తుంది?
ఉదాహరణకు ఒక ప్రయాణికుడు న్యూఢిల్లీ నుండి వారణాసికి వెళ్లే శివ్ గంగా ఎక్స్ప్రెస్లో నవంబర్ 15న ప్రయాణానికి టికెట్ బుక్ చేయాలనుకుంటే దాని కోసం బుకింగ్ విండో సెప్టెంబర్ 16 రాత్రి 12:20 AMకి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో నుంచి 12:35 AM వరకు ఆధార్ ధృవీకరించిన IRCTC ఖాతాలతో ఉన్న ప్రయాణికులకే టికెట్ బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆధార్ ధృవీకరణ లేని ఖాతాలకు ఈ తొలి 15 నిమిషాల్లో టికెట్ బుక్ చేసే అవకాశం ఉండదు. సాధారణంగా రైల్వే టికెట్లు తొలి 15 నిమిషాల్లోనే గణనీయంగా బుకింగ్స్ అవుతుంటాయి. ఆ సమయంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. రైల్వే శాఖ తాజా నిర్ణయంతో అసలైన ప్రయాణికులకు లాభం చేకూరనుంది.
పండుగలు, పెళ్లిళ్ల సీజన్పై ప్రభావం
దీపావళి, ఛఠ్ పూజ, హోలీ వంటి పెద్ద పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో ప్రయాణానికి టికెట్ డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రయాణానికి 60 రోజుల ముందు బుకింగ్ విండో ఓపెన్ అయినప్పుడు జనరల్ టికెట్ కోసం ప్రయాణికుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇది తాత్కాలిక బుకింగ్లో ఉండే పోటీని తలపిస్తుంది. కొత్త ఆధార్ ఆధారిత నిబంధన వల్ల ఈ అధిక డిమాండ్ సమయంలో టికెట్లు బుక్ చేయడంలో పారదర్శకత పెరిగి తప్పుడు బుకింగ్లు తగ్గుతాయని రైల్వే భావిస్తోంది.
తత్కాల్ విషయంలోనూ..
రైల్వే శాఖ తెచ్చిన నయా రూల్.. తత్కాల్ టికెట్ల విషయంలో ఇప్పటికే అనుసరిస్తున్నారు. ఇది కొత్త ప్రయత్నం కాదు. ఈ ఏడాది జూలైలో తాత్కాల్ బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు ఆధార్ ధృవీకరించిన IRCTC ఖాతా తప్పనిసరి అని భారత రైల్వే నిర్ణయించింది. అప్పటి నుంచి ఆధార్ ధృవీకరణ లేని ప్రయాణికులు IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో Tatkal టికెట్లు బుక్ చేయలేకపోయారు.
Also Read: IND vs PAK: పాక్తో షేక్ హ్యాండ్ రగడ.. చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చిన బీసీసీఐ
ప్రయాణికులు ఏం చేయాలంటే?
అక్టోబర్ 1 రావడానికి ముందే ప్రయాణికులు ఆధార్ ను తమ ఐఆర్ సీటీసీ అకౌంట్ కు అనుసంధానం చేసుకోవాలని రైల్వే వర్గాలు కోరుతున్నాయి. తద్వారా కొత్త నిబంధన వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ మార్పు ద్వారా కోట్లాది ప్రయాణికులకు మరింత సురక్షితమైన, న్యాయమైన టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగం కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.