H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలసలను అరికట్టడంలో భాగంగా హెచ్ 1-బీ వీసాపై కొత్త ఉత్తర్వలు జారీ చేశారు. దీని ప్రకారం H-1B వీసా దఖాస్తు రుసుమును 1 లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు)కు పెంచారు. అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులే తమ దేశానికి రావాలని కోరుకుంటూ ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు.
వైట్ హౌస్ స్పందన..
వైట్హౌస్ కార్యదర్శి విల్ షార్ఫ్ మాట్లాడుతూ.. H-1B వీసా ప్రోగ్రాం ప్రస్తుతం అమెరికాలో అత్యంత దుర్వినియోగం అవుతున్న వీసా వ్యవస్థల్లో ఒకటని పేర్కొన్నారు. ‘కంపెనీలు H-1B అభ్యర్థులను స్పాన్సర్ చేయడానికి చెల్లించే ఫీజును 1 లక్ష డాలర్లకు పెంచుతున్నాం. దీని వల్ల నిజంగా అత్యుత్తమ నైపుణ్యంతో ఉన్నవారే రాగలరు. అలాగే వారు అమెరికన్ ఉద్యోగులను భర్తీ చేసే పరిస్థితి ఉండదు’ అని ఆయన పేర్కొన్నారు.
H-1B వీసా అంటే ఏమిటి?
H-1B ఒక తాత్కాలిక అమెరికా వర్క్ వీసా. దీని ద్వారా కంపెనీలు ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవచ్చు. 1990లో ఈ ప్రోగ్రాం ప్రారంభమైంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాలలో పనిచేయడానికి బాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత కలిగినవారిని రిక్రూట్ చేసుకునేందుకు H-1B వీసాను అమెరికా తీసుకొచ్చింది. ఈ వీసా మూడు సంవత్సరాలకు జారీ అవుతుంది. గరిష్టంగా ఆరు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. గ్రీన్ కార్డ్ పొందిన వారు దీనిని నిరంతరం పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంటుంది. USCIS వద్ద ఆన్లైన్లో నమోదు చేసిన తర్వాత.. లాటరీ విధానంలో దరఖాస్తుదారులను ఎంచుకుంటారు. H-1B వీసా కలిగిన వారికి అమెరికన్ ఉద్యోగుల మాదిరిగానే వేతనం, పని పరిస్థితులు లభిస్తాయి.
భారతీయులపై ప్రభావం
H-1B వీసా హోల్డర్లలో భారతీయులే ఎక్కువ. గత ఏడాది ఆమోదం పొందిన దరఖాస్తుల్లో 71% భారత్దే. చైనా రెండో స్థానంలో 11.7% లో ఉంది. 2025 మొదటి అర్ధభాగంలో అమెజాన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) కలిపి 12,000 పైగా H-1B వీసాలు పొందాయి. మైక్రోసాఫ్ట్, మెటా ఒక్కోటి 5,000 పైగా వీసాలు అందుకున్నాయి. కానీ ట్రంప్ కొత్త నిర్ణయం వల్ల భారతీయులకు అమెరికా వీసా పొందడం మరింత కష్టసాధ్యం కానుంది. ప్రతి సారి రూ.88 లక్షల ఫీజు చెల్లించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయనుంది.
అమెరికా పౌరసత్వ పరీక్ష..
హెచ్1-బీ వీసా పొందే క్రమంలో అదనంగా.. అమెరికా పౌరసత్వ పరీక్షను కూడా అమెరికా నిర్వహించనుంది. ఈసారి దానిని మరింత కఠినంగా అమలు చేయాలని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్ 2020లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వచ్చిన బైడెన్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ దానిని పునరుద్ధరించేందుకు ట్రంప్ కసరత్తు చేస్తున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులు.. అమెరికా చరిత్ర, రాజకీయాలపై మెుత్తం 128 ప్రశ్నలు అడుగుతారు. అందులో ఒక్కో టాపిక్ నుంచి అడిగే 20 ప్రశ్నలకు కనీసం 12 కి సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.
Also Read: Huzurabad: అంగన్వాడీ గుడ్లతో.. మందుబాబులకు స్నాక్స్.. వామ్మో ఇలా ఉన్నారేంట్రా!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వీసా ప్రోగ్రాం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. హెచ్-1బీ వీసాతో పాటు మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దాని ద్వారా ‘గోల్డ్ కార్డ్’ వీసా ప్రోగ్రాం ప్రారంభించారు. ఇందులో వ్యక్తుల కోసం 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8.8 కోట్లు), వ్యాపారాల కోసం 2 మిలియన్ డాలర్ల ఫీజు నిర్ణయించారు. ‘దీని ద్వారా అమెరికాకు బిలియన్ల డాలర్లు సమకూరతాయి. దీన్ని పన్నులు తగ్గించడానికి, అప్పులు తీర్చడానికి వాడతాం’ అని ట్రంప్ అన్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవర్డ్ లట్నిక్ మాట్లాడుతూ ‘ఈ ప్రణాళిక ద్వారా అమెరికాకు రావడానికి అగ్రశ్రేణి ప్రతిభావంతులకు మాత్రమే అవకాశం ఉంటుంది. వారు వ్యాపారం ప్రారంభించి, అమెరికన్లకు ఉద్యోగాలు సృష్టిస్తారు’ అని పేర్కొన్నారు.