Huzurabad: గర్భిణులు, చిన్నపిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అంగన్వాడీ పథకం హుజూరాబాద్లో అపహాస్యానికి గురవుతోంది. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు, గర్భిణుల కోసం కేటాయించిన పోషకాహారం అక్రమార్కుల చేతుల్లో పడి దుర్వినియోగం అవుతోందని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ పథకం లబ్ధిదారులకు చేరడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
పశువులకు బాలమృతం, వైన్షాపులకు గుడ్లు
ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే బాలమృతం, కోడిగుడ్లు, బియ్యం, పప్పులు వంటి పోషక పదార్థాలు అంగన్వాడీ కేంద్రాల నుంచి అక్రమంగా బయటకు తరలిపోతున్నాయి. ముఖ్యంగా, పిల్లలకు అందించాల్సిన బాలమృతం పశువులకు ఆహారంగా మారుతోందని, కోడిగుడ్లు వైన్షాపులు, పర్మిట్ రూమ్లలో మద్యం తాగేవారికి ‘స్టెప్’గా ఉపయోగపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు మహిళలు అడ్డుకున్నా, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైన్షాపులో అంగన్వాడీ గుడ్లు లభ్యం
హుజూరాబాద్లోని కరీంనగర్ రోడ్డులో గల రేణుక ఎల్లమ్మ వైన్స్ పక్కన ఉన్న పర్మిట్ రూమ్లో అంగన్వాడీ గుడ్లు కనిపించడం ఈ అక్రమాలకు తాజా నిదర్శనం. ఈ విషయం పత్రికలలో వార్తగా రావడంతో, సీడీపీఓ సుగుణ విచారణ చేపట్టారు. షాపు యజమానిని విచారించగా, తన కూతుళ్లు రంగాపూర్ గ్రామం నుంచి ఆ గుడ్లు ఇచ్చారని చెప్పినట్లు తెలిసింది. అయితే, ప్రభుత్వ పథకం కింద కేటాయించిన వస్తువులను ఇతరులకు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధం కావడంతో సీడీపీఓ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ వ్యవహారంపై ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
ఈ అక్రమాల వెనుక హుజూరాబాద్ ప్రాజెక్ట్ అధికారి (CDPO) సుగుణ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో బియ్యం తరలిపోతున్నప్పుడు ఫిర్యాదు చేసినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు గుడ్ల విషయంలోనూ సరిగా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. తోటి టీచర్లు, ఆయాలు కూడా బహిరంగంగా ఆమె వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం వృథా కావడమే కాకుండా, అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Viral Video: మీ బతుకు తగలెయ్యా.. రీల్స్ కోసం ఇంతలా దిగజారాలా.. ఆఖరికి పాములతో..
ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
హుజూరాబాద్లో జరుగుతున్న ఈ అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, అర్హులకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే, ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతిని, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని స్థానిక ప్రజా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.