Duddilla Sridhar Babu: హైదరాబాద్ను కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాకుండా, భారతదేశ క్రియేటివిటీ హబ్గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) సంయుక్త ఆధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐఐసీలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘ఇండియాజాయ్ 2025’ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందన్నారు. క్రియేటివ్ రంగానికి చేయూతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్లను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీనైనా నెరవేర్చారా? కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు
దేశీయ గేమింగ్, వీఎఫ్ఎక్స్ వృద్ధి
భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ ప్రస్తుతం 3.1 బిలియన్ డాలర్లుగా ఉందని, ఇది 20 శాతం సీఏజీఆర్ వృద్ధి రేటుతో 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మంత్రి అంచనా వేశారు. దేశ మొత్తం వీఎఫ్ఎక్స్ అవుట్పుట్లో తెలంగాణ వాటా సుమారు 25 శాతం ఉండటం గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాల అందుబాటులోకి వస్తే ఈ క్రియేటివ్ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందని శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
