Wedding tragedy: ఏడాదిక్రితం భార్య కన్నుమూయడంతో ఒంటరి జీవితాన్ని నెట్టుకురాలేక, ఎవరైనా తోడుంటే బావుంటుందనే ఉద్దేశంతో ఓ తాతయ్య 75 ఏళ్ల వయసులో ముచ్చటపడి రెండో పెళ్లి చేసుకున్నాడు. తన వయసులో సగం కంటే ఇంకా చిన్నదైన ఓ 35 ఏళ్ల మహిళను వివాహమాడాడు. పెళ్లైన రోజు సంతోషంగా కనిపించిన ఆయన, తెల్లారేసరికి (Wedding tragedy) చనిపోయాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లా కుచ్ముచ్ గ్రామంలో జరిగింది.
మొదటి భార్య చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్న సంగ్రురామ్ అనే వ్యక్తికి, సంతానం కూడా ఎవరూ లేరు. దీంతో, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించాడు. సంవత్సర కాలంగా ఇలాగే గడిపిన ఆయన, ఒంటరితనాన్ని భరించలేకపోయాడు. శేషజీవితంలో ఎవరైనా తోడుంటే బాగుందని భావించాడు. మనసులో మాటను బంధువులకు చెప్పగా, మళ్లీ పెళ్లి చేసుకోవద్దని సలహా ఇచ్చారు. కానీ, ఆయన ఎవరి మాట పట్టించుకోకుండా ముందడుగు వేశాడు. సెప్టెంబర్ 29 సోమవారం నాడు, జలాల్పూర్ ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల మన్భావతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ముందుగా కోర్టులో పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత గ్రామంలోని ఓ ఆలయంలో సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లి చేసుకున్న సమయం కూడా తిరిగిరాకుండానే తెల్లారేసరికి సంగ్రురామ్ మరణించాడు. ఈ పరిణామంతో అతడి బంధువులు, గ్రామస్థులు షాక్కు గురయ్యారు.
Read Also- Asia Cup Trophy Row: ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకపోవడంపై నక్వీని నిలదీసిన బీసీసీఐ!
మాన్భావతి ఏం చెబుతోంది?
పెళ్లై ఒక్క రోజు కూడా తిరక్కుండానే భర్త చనిపోవడంపై భార్య మాన్భావతి స్పందించింది. ‘‘ఇంటి బాధ్యతలు నువ్వు చూసుకో. పిల్లల (మాన్భావతి పిల్లలు) విషయంలో నేను జాగ్రత్త తీసుకుంటా’’ అని సంగ్రురామ్ తనతో చెప్పాడని తెలిపింది. పెళ్లైన రోజు రాత్రి ఎక్కువ సమయం మాటలతోనే గడిపామని ఆమె వివరించింది. అయితే, తెల్లారేసరికి సంగ్రురామ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించిందని, వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారని మాన్భావతి వివరించింది.
Read Also- Local Body Elections: నోటిఫికేషన్ వచ్చేలోగా.. రిజర్వేషన్ల ప్రక్రియలో మార్పులు చేర్పులు?
సంగ్రురామ్ మృతిపై అనుమానాలు
సంగ్రురామ్ మృతిపై గ్రామంలో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది గ్రామస్థులు ఇది సహజ మరణమని చెబుతుండగా, మరికొంతమంది మాత్రం అనుమానాస్పదం మరణమని అంటున్నారు. ఢిల్లీలో నివసిస్తున్న సంగ్రురామ్ మేనల్లుడితో పాటు అతడి బంధువులు కూడా ఈ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంత్యక్రియలను తాత్కాలికంగా ఆపివేయాలని స్థానికులకు సూచించారు. తాము లేకుండా అంత్యక్రియలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. సంగ్రురామ్ మరణంపై పోలీసు విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, పోస్ట్మార్టం నిర్వహించే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై స్పష్టత రాలేదు.