Navjyot Singh death: ఆదివారం (సెప్టెంబర్ 14) మధ్యాహ్నం ఢిల్లీలోని కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ దగ్గర ఓ బీఎండబ్ల్యూ కారు వేగంగా వెళ్లి బైక్ను ఢీకొన్న ఘటనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి నవజ్యోత్ సింగ్ ప్రాణాలు (Navjyot Singh death) కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారు నడిపిన మహిళ గగన్ప్రీత్ కౌర్ను ఓ హాస్పిటల్లో సోమవారం అరెస్ట్ చేశారు. జీబీటీ నగర్లోని ఓ హాస్పిటల్లో అరెస్ట్ అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదంలో నిందితురాలికి కూడా చిన్నపాటి గాయాలు అయినట్టు వీడియోల్లో కనిపించింది. పోలీసు వాహనంలోకి ఎక్కించేందుకు ఆమెకు సాయం అందించాల్సి వచ్చింది. కాగా, నిందితురాలు గగన్ప్రీత్ కౌర్పై నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించడం, ఆధారాలు చెరిపివేత వంటి సెక్షన్లను కేసులో పొందుపరిచారు.
కాగా, గగన్ప్రీత్ కౌర్ వయస్సు 38 సంవత్సరాలు అని పోలీసులు వెల్లడించారు. ఆమె భర్త పరిక్షిత్ మక్కడ్ (40 ఏళ్లు) కూడా ప్రమాద సమయంలో అదే కారులో ఉన్నాడు. దంపతులు గురుగ్రామ్లో నివసిస్తూ లగ్జరీ ప్రొడక్ట్స్ వ్యాపారం చేస్తున్నారు. పరిక్షిత్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు.
నవజ్యోత్ సింగ్ సీనియర్ అధికారి
బీఎండబ్ల్యూ ప్రమాదంలో నవజ్యోత్ సింగ్ (52) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆదివారం తన భార్య సందీప్ కౌర్తో కలిసి వెళ్లి బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అనంతరం ఆర్కే పురంలోని కర్ణాటక భవన్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్తుండగా ఈ ఘోరప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు అధిక వేగంతో వెనుక నుంచి వచ్చి తమ బైక్ను ఢీకొట్టిందని సందీప్ కౌర్ పోలీసులకు వెల్లడించారు. కారు తిరగబడిందని, ఈ ప్రమాదంలో నవజ్యోత్కు తీవ్రమైన గాయాలయ్యాయని ఆమె విలపించారు.
Read Also- Adwait Kumar Singh: రోగులకు మెరుగైన వైద్యం అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు
హాస్పిటల్ కోసం 19 కిలోమీటర్లు..
ప్రమాదం తర్వాత నవజ్యోత్ సింగ్, సందీప్ను ఒక వాన్లో ఓ ఆసుపత్రికి తరలించారు. వారితో పాటు అదే వ్యాన్లో నిందితురాలు గగన్ప్రీత్ కౌర్ కూడా వెళ్లింది. తమను సమీపంలోని హాస్పిటల్లో చేర్చాలంటూ సందీప్ కౌర్ పదేపదే కోరినా గగన్ప్రీత్ కౌర్ పట్టించుకోలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఏకంగా 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్లో ఉన్న నూలైఫ్ హాస్పిటల్కు తీసుకెళ్లాలని గగన్ప్రీత్ కౌర్ చెప్పినట్టు బాధితురాలు సందీప్ కౌర్ వెల్లడించారు. పలు మార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు. వ్యాన్ నడిపిన వ్యక్తి ప్రమాదంపై స్పందించి సాయంగా వచ్చాడని, అతడి పేరు గల్ఫామ్ అని పోలీసులకు వివరించారు.
Read Also- Mahesh Kumar Goud: క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్.. రూ.200 కోట్లు విడుదల
పోలీసుల వివరాల ప్రకారం, న్యూలైఫ్ ఆసుపత్రిలో గగన్ప్రీత్ తండ్రికి భాగస్వామ్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును దాచిపెట్టే ప్రయత్నం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ప్రమాద విషయంలో పాటించాల్సిన ప్రోటోకాల్ను పాటించామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. అయితే, గగన్ప్రీత్కి యాజమాన్యంతో సంబంధం ఉందా?, లేదా? అన్నదానిపై స్పందించేందుకు మాత్రం నిరాకరిస్తున్నారు.