Black Magic: ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు జరగడం స్థానికంగా కలకలం రేపింది.వరంగల్ (Warangal) జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి భయానక వాతావరణాన్ని సృష్టించారు. పాఠశాల ప్రధాన గది ముందు పసుపు, కుంకుమ చల్లి, నిమ్మకాయలు, కొబ్బరికాయలతో భయపెట్టే రీతిలో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఆ దృశ్యాలను చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు ఏడుస్తూ వెనక్కి తిరగగా, మరికొందరు ఆందోళనతో ఉపాధ్యాయులను ఆశ్రయించారు. తక్షణమే ఉపాధ్యాయులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న రాయపర్తి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామాల్లో విచారణ ప్రారంభించారు.
Also Read: JubileeHills Survey: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సర్వే.. ఆ సామాజికవర్గానిదే కీలక పాత్ర!
గ్రామంలో చర్చలు హోరెత్తుతున్నాయి
ఈ ఘటనతో మైలారం గ్రామం మొత్తం ఒకే ఒక్క చర్చగా మారింది. కొందరు నిజంగానే క్షుద్ర పూజలు జరిగాయని చెబుతుండగా, ఇంకొందరు ఇది పూర్తిగా ఆకతాయిల పని అని అంటున్నారు. పాఠశాల వాతావరణం చెడగొట్టడానికి కొంతమంది ఇలా చేసి ఉండవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.పాఠశాల వద్ద భయానక వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన పిల్లలు భయపడిపోతున్నారు,ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు పాఠశాల వద్ద రాత్రి పూట గస్తీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి కారణమైన వారిని త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం అని రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ హామీ ఇచ్చారు.
Also Read: Illegal Construction: తూంకుంటలో అక్రమ నిర్మాణాలకు బ్రేక్.. స్పందించిన అధికారులు