GHMC: అభివృద్ది ప్రణాళికలు, పాలసీ ల రూపకల్పనకు క్వాలిటీ సెన్సెస్ డేటా ఎంతో అవసరమని రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి అన్నారు. పటాన్చెరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో రామచంద్రపురం డివిజన్-112 పరిధిలో నిర్వహించనున్న సెన్సెస్ ఆఫ్ ఇండియా–2027 ప్రీ టెస్ట్ కార్యక్రమం కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్-112 పరిధిలో ఈ నెల 10 వ తేదీ నుంచి ఈ నెల 30 వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రణాళికలు, పాలసీల రూపకల్పనలో క్వాలిటీ సెన్సెస్ డేటా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు.
Also Read: GHMC: 25న జీహెచ్ఎంసీ కౌన్సిల్.. వచ్చే ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్ పై చర్చకు ఛాన్స్!
అత్యంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో నిర్వహించాలి
అందుకే ఈ సెన్సెస్ కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో గుణాత్మకంగా నిర్వహించాలని సూచించారు. 2026–27లో దేశంలో ఇంటింటికీ వెళ్లి డేటా సేకరించే ప్రధాన సెన్సెస్ కార్యక్రమం ప్రపంచంలో అతిపెద్దదని ఆమె వివరించారు. ఇంతటి పెద్ద కార్యక్రమం విజయవంతం కావాలంటే ఈ ప్రీ టెస్ట్ కార్యక్రమాన్ని అత్యంత జాగ్రత్తగా, క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తే సెన్సెస్ ఖచ్చితంగా, నాణ్యతతో పూర్తవుతుందని ఆమె పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో జరుగుతున్న ఈ సెన్సెస్ కుటుంబాల వాస్తవ స్థితిగతులను ప్రతిబింబిస్తే, రాబోయే రోజుల్లో రూపొందించే నగర ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ప్రీ టెస్ట్ కార్యకలాపాల లక్ష్యాలు, విధానాలు, సమయపాలన, డేటా సేకరణలో అనుసరించాల్సిన ప్రమాణాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరావు, సెన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీకాంత్, సెన్సెస్ చార్జ్ ఆఫీసర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో మూడు ఏరియాల్లో ప్రీ టెస్ట్ కార్యక్రమం
తెలంగాణలో సెన్సెస్ ఆఫ్ ఇండియా–2027 ప్రీ టెస్ట్ కార్యక్రమం మూడు ఏరియాల్లో జరగనున్నట్లు రాష్ట్ర సెన్సెస్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. అర్బన్ ఏరియా కు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలోని రామచంద్రపురం డివిజన్-112 లో రూరల్ ఏరియా లకు సంబంధించి తిప్పర్తి ( నల్గొండ జిల్లా), పినపాక ( భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా) లో ప్రీ టెస్ట్ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. నవంబర్ 10 నుంచి నవంబర్ 30 వరకు జరగనున్న ఈ ఫ్రీ టెస్ట్ కార్యక్రమం లో అర్బన్ ఏరియా కు సంబంధించి ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా జీహెచ్ఎంసీ కమిషనర్, రూరల్ ఏరియా లకు సంబంధించి సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా వ్యవహరించనున్నట్లు, ఈ ప్రీ టెస్ట్ సెన్సెస్ 2026–27 ప్రధాన సెన్సస్కు ముందు పరీక్షాత్మక దశగా, సమాచార సేకరణ విధానాల ఖచ్చితత్వాన్ని పెంపొందించడానికి దోహదం చేయనున్నట్లు ఆమె అభిప్రాయపడ్డారు.
