Team India Sponser: ‘రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్స్’పై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించడంతో, భారీగా ఆదాయాన్ని కోల్పోనున్న ఆన్లైన్ గేమింగ్ యాప్ ‘డ్రీమ్11’ (Dream 11) భారత క్రికెట్ టీమ్ జెర్సీ స్పాన్సర్షిప్ ఒప్పందం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. దీంతో, కొత్త స్పాన్సర్ ఎంపిక బీసీసీఐకి అనివార్యమైంది. గత కొన్ని వారాలుగా స్పాన్సర్ను వెతికే పనిలో ఉన్న బీసీసీఐ పెద్దలు ఎట్టకేలకు మంగళవారం ఒక కంపెనీని ఫైనల్ చేశారు. ఇండియన్ క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్గా (Team India Sponser) అపోలో టైర్స్ (Apollo Tyres) ఖరారైంది. ఈ మేరకు బీసీసీఐ ఎంపిక చేసింది. 2027 వరకు స్పాన్సర్షిప్ హక్కులను ఈ కంపెనీ దక్కించుకుంది.
ఒక్కో మ్యాచ్కు రూ.4.5 కోట్లు..
అపోలో టైర్స్ రూపంలో బీసీసీఐ మంచి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక్కో మ్యాచ్కు రూ.4.5 కోట్లు చొప్పున బీసీసీఐకి అపోలో టైర్స్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రీమ్11 చెల్లించిన రూ.4 కోట్ల కంటే ఇది ఏకంగా రూ.50 లక్షలు ఎక్కువ కావడం గమనార్హం. అయితే, ఈ ఒప్పందం ద్వారా అపోలో టైర్స్కు అంతర్జాతీయంగా గుర్తింపు లభించనుంది. భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతుంది కాబట్టి గ్లోబల్ స్థాయిలో కంపెనీకి ప్రచారం లభించే అవకాశముంది.
కాగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్కు సంబంధించిన యాప్స్పై నిషేధం విధించింది. రియల్ మనీ యాప్లను కట్టడి చేసేందుకు కొత్త చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేసింది. ఈ ప్రభావం డ్రీమ్11పై గట్టిగా పడింది. భారీగా ఆదాయాన్ని కోల్పోనుంది. అందుకే, టీమిండియా జెర్సీ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగింది. అందుకే, భారత పురుషుల క్రికెట్ జట్టు ఎలాంటి స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ టోర్నమెంట్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా ఉమెన్స్తో భారత మహిళల జట్టు ఇటీవల మూడు వన్డేల సిరీస్ ఆడగా, అందులో కూడా స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగింది.
రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫారమ్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, బీసీసీఐకి జట్టు కోసం స్పాన్సర్ లేకుండా పోయింది. డ్రీమ్11పై ఈ నిషేధం ప్రభావం చూపడంతో, అది ఒప్పందం నుంచి తప్పుకుంది. ప్రస్తుతం టీమిండియా దుబాయ్లో జరుగుతున్న ఆసియా కప్ను స్పాన్సర్ లేకుండా ఆడుతోంది. కాన్వా (Canva), జేకే టైర్ (JK Tyre) కంపెనీలు టైటిల్ స్పాన్సర్షిప్ రేసులో ఉన్నప్పటికీ, అపోలో టైర్స్ దక్కించుకుందని వివరించారు. బిర్లా ఆప్టస్ పెయింట్స్ (Birla Optus Paints) కూడా ఆసక్తి కనబరిచినప్పటికీ బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదని సమాచారం.
కాగా, అపోలో టైర్స్ స్పాన్సర్షిప్ ఒప్పందంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, బీసీసీఐ త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయనుందని తెలుస్తోంది. కాగా, డ్రీమ్11 ఒప్పందం రద్దయిన తర్వాత, స్పాన్సర్ కావాలనుకునే కంపెనీలకు బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. గేమింగ్, బెట్టింగ్, క్రిప్టో, పొగాకు రంగాల్లోని బ్రాండ్లు బిడ్డింగ్లో పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది.