Warangal ACB: నేను మోనార్క్ ని…నన్నెవరూ ఏమీ చేయలేరంటూ ఏసీబీ వరంగల్ రేంజ్ లోని వసూళ్ల అధికారి చెప్పుకొంటున్నట్టుగా తెలిసింది. ఇలాంటి ఎంక్వయిరీలు ఎన్నో చూశానని అంటున్నట్టుగా సమాచారం. కాగా, ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక అంది రోజులు గడుస్తున్నా ఉన్నతాధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం దీని వెనక ఉన్న మతలబు ఏంటని వరంగల్ ఏసీబీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తున్నట్టుగా తెలియవచ్చింది. వరంగల్ జిల్లాలో ఎమ్మార్వోగా పని చేస్తున్న ఓ అధికారిని కొన్ని రోజుల క్రితం ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అరెస్టులో కీలకపాత్ర వహించిన ఓ డీఎస్పీ(DSP) సదరు ఎమ్మార్వో మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
20లక్షలు తీసుకుని వసూళ్ల సార్..
ఆ తరువాత ఫోన్ లోని కాల్, వాట్సాప్(WhatsApp) లిస్టును బయటకు తీశారు. అనంతరం ఒక్కొక్కరికి ఫోన్లు చేస్తూ మేం అరెస్ట్ చేసిన ఎమ్మార్వో(MRO)కు మీరు బినామీలని దర్యాప్తులో వెల్లడైంది…అరెస్ట్ చేయక తప్పదని బెదరగొడవుతూ వసూళ్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. హైదరాబాద్(Hyderabad) లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ఎమ్మార్వో స్నేహితున్ని ఇలాగే భయపెట్టి కోటిన్నర రూపాయలకు బేరం కుదుర్చుకుని 20లక్షల రూపాయలు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సదరు డీఎస్పీ బ్యాచ్ మేట్, హైదరాబాద్ కమిషనరేట్ లోని కీలక విభాగంలో పని చేస్తున్న మరో అధికారి తన అధికారిక వాహనంలో వరంగల్ వెళ్లి హనుమకొండ(Hanumakonda) ఎన్ఐటీ ప్రాంతంలోని పిస్తా హౌస్ వద్ద 20లక్షలు తీసుకుని వసూళ్ల సార్ కు ఇచ్చినట్టుగా వార్తలొచ్చాయి. కాగా, కొందరు బాధితులు వసూళ్ల సార్ వేధింపులు ఎక్కువ కావటంతో ఏసీబీ ఉన్నతాధికారులకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో రికార్డింగులను కూడా అందచేశారు. దాంతో ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపించారు.
Also Read: Bhatti Vikramarka: గురుకులాల డైట్, అద్దె బకాయిలు విడుదల చేయండి : డిప్యూటీ సీఎం ఆదేశం
భయపెట్టారో.. బెదిరించారో..!
ఆ వెంటనే హైదరాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చిన వసూళ్ల సార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అక్కడికి పిలిపించుకున్నారు. బతిమాలారో.. భయపెట్టారో తెలియదుగానీ తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇదే విషయాన్ని ఓ వ్యక్తికి ఫోన్ ద్వారా చెప్పిన వసూళ్ల సార్ నా పక్కనే సాఫ్టే వర్ ఇంజనీర్ కూర్చుని ఉన్నాడంటూ మాట్లాడారు. ఈ ఆడియో రికార్డింగ్ కూడా వెలుగులోకి వచ్చింది. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ జరిపిన అధికారులు నివేదికను సమర్పించారు. అయితే, రోజులు గడుస్తున్నాయి తప్పితే ఇప్పటివరకు దీనిపై చర్యలు లేవు. ఈ నేపథ్యంలోనే వసూళ్ల సార్ తన సన్నిహితుల వద్ద తిప్పాల్సిన చక్రం తిప్పేశాను.. ఇక ఎలాంటి సమస్య లేదు అని చెప్పుకుంటున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం వరంగల్ ఏసీబీ(Warangal ACB) వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ నడుస్తున్నట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే, ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం దాడులు జరగకపోవటం ఇక్కడ కొసమెరుపు. ఆర్టీఏ కార్యాలయాల నుంచి నెలనెలా వాటాలు అందుతున్న క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆఫీసులపై దాడులు జరగలేదని ఏసీబీ వర్గాలే అంటున్నాయి.
Also Read: Terror Plot Foiled: పంజాబ్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. బయటపడ్డ ఐఎస్ఐ లింకులు
