Bhatti Vikramarka: ఎస్సీ, మైనారిటీ గురుకులాలు, హాస్టళ్ల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సుమారు రూ.163 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సాయంత్రం ప్రజాభవన్లో ఆర్థిక శాఖ, గురుకులాల అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న బకాయిల వివరాలను డిప్యూటీ సీఎం స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మొటిక్స్ బకాయిలకు సంబంధించిన రూ.51.36 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలి
వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని మైనారిటీ గురుకులాలు, మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు రూ.47.61 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.63.92 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో, వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిన విషయాన్ని భట్టి గుర్తు చేశారు.
ఆహార నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దు
నిర్వహకులు ఆహార నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచించారు. అధికారుల సందర్శనకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్వాహకులు నివేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్షిప్ రూ.303 కోట్లు వెంటనే విడుదల చేయాలి: భట్టి విక్రమార్క
