TG Medical Council: తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్, సర్కార్ మధ్య వివాదం నెలకొన్నది. ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీవో 229 ఇందుకు కారణమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవో ద్వారా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థపై పెత్తనం పెరుగుతుందని కౌన్సిల్ సభ్యులు, వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కానీ, మానిటరింగ్ లేనందున కౌన్సిల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతోనే జీవో 229 తీసుకురావాల్సి వచ్చినట్లు వివరిస్తున్నాయి. ఈ విధానం నేషనల్ మెడికల్ కమిషన్తో పాటు ఇతర రాష్ట్రాల స్టేట్ మెడికల్ కౌన్సిల్ లోనూ ఉన్నట్లు సర్కార్ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ అంశంలో రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడి, వైద్య రంగంలో హాట్ టాపిక్గా మారింది. ఈ అంశంలో డాక్టర్లు కూడా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర విమర్శలకు దిగుతున్న పరిస్థితి నెలకొన్నది. సామాజిక మాద్యమాల్లో విమర్శల పర్వం కొనసాగుతున్నది.
కారణం ఇదేనా?
జీవో 299 ద్వారా మెడికల్ కౌన్సిల్లో ప్రభుత్వ ప్రాతినిధ్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో నలుగురుగా ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను ఇప్పుడు 8కి పెంచారు. కౌన్సిల్లో 25 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా, తాజా జీవో ద్వారా సంఖ్య 29కి చేరుతుంది. ఇందులో ఎన్నికైన సభ్యులు 13 మంది కాగా, మిగిలిన వారంతా ప్రభుత్వం నియమించిన నామినేటెడ్, ఎక్స్ అఫీషియో సభ్యులే ఉంటారు. దీనివల్ల భవిష్యత్తులో చైర్మన్ ఎన్నిక జరిగితే ప్రభుత్వం అనుకున్న వ్యక్తే ఆ పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. దీంతోనే ప్రస్తుత కౌన్సిల్ మెంబర్లలో కొందరితో పాటు మరి కొంతమంది డాక్టర్ల యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.
Also Read: TG Medical Council: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. ఆ డాక్టర్లపై వేటు..?
నిధుల గోల్మాల్పై ఆడిటింగ్?
కౌన్సిల్ నిధుల వినియోగంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. కోట్లాది రూపాయల నిధులకు లెక్కలు లేవని, నిబంధనలకు విరుద్ధంగా సభ్యులు వేతనాలు డ్రా చేస్తున్నారని కొందరు డాక్టర్లే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై గుర్రుగా ఉన్న సర్కార్ ఇప్పటికే ఇంటర్నల్ ఎంక్వయిరీ ద్వారా కూడా తగిన వివరాలను తెప్పించుకున్నట్లు తెలిసింది. కౌన్సిల్ సభ్యులకు కేవలం సమావేశాల సమయంలో సిట్టింగ్ ఫీజు మాత్రమే ఇవ్వాలనే రూల్ ఉన్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. కానీ, కొందరు సభ్యులు నెలవారీ వేతనాలు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలకు అతీతంగా కౌన్సిల్పై వరుసగా ఫిర్యాదులు చేశారు. ఇందులో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం నిధుల వినియోగంపై ఆడిటింగ్కు ఆదేశించింది. ప్రస్తుతం అధికారులు ఎంక్వయిరీ చేయాలని నిర్ణయించారు.
కోర్టు మెట్టు ఎక్కాలని
ప్రభుత్వ పెత్తనం పెరగకుండా ఉండేందుకు రెండు రోజుల కిందటే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించి, పట్టు నిలుపుకునే ప్రయత్నం కౌన్సిల్లో జరిగినట్లు సమాచారం. అంతేగాక ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని కౌన్సిల్ సభ్యులు భావిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో ఏర్పాటైన ఈ కౌన్సిల్ శాశ్వతంగా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లకుండా ప్రత్యేక వ్యూహంతో వెళ్లాలని ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ భావిస్తున్నట్లు తెలిసింది.
Also Read:TG ACB Rides: 2025 లో ఏసీబీ దూకుడు.. వందల కోట్ల అక్రమాస్తుల పూర్తి సమాచారం ఇదే..!

