Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు. స్వాతంత్ర సమరయోధులు, అమరవీరులు, ప్రజా పోరాట యోధుల త్యాగం వల్లే నేడు ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయని పేర్కొన్నారు.
Also Read: Teenmar Mallanna: తెలంగాణలో సంచలనం.. కొత్త పార్టీ పెట్టిన తీన్మార్ మల్లన్న.. పేరు ఏంటంటే?
ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని సెప్టెంబర్ 17
ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు, ప్రజలే అధిపతులు అనే స్ఫూర్తిని సెప్టెంబర్ 17 అందరికీ గుర్తు చేస్తుందని తెలిపారు. ఇలాంటి త్యాగదనుల ఆశయ సాధన కోసమే సీఎం రేవంత్ రెడ్డి దార్శినికతతో ప్రజాపాలనను కొనసాగిస్తున్నారని వివరించారు. విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ రంగం, ఉపాధిరంగం సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ప్రజా పాలనలో ప్రజల హక్కులు కాపాడుతున్నామని వెల్లడించారు.
రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి
రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాల ద్వారా రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుతో నీటి కల నెరవేరిందని, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనతో జిల్లాకు ఖ్యాతి గడించిందని, భద్రాచలానికి రాకపోకల సౌకర్యం కల్పించేలా రైల్వే లైన్ పనులు సైతం వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగూడెం గ్రాండ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రింగ్ రోడ్డు, బైపాస్ రోడ్డు, నేషనల్ హైవే పనులు కూడా ప్రగతిలో ఉన్నాయని వివరించారు. సింగరేణి సంస్థను బలోపేతం చేయడం, భవిష్యత్తులో థర్మల్ సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కుల గణన
బడుగు బలహీన వర్గాలు, కూలీలు, శ్రమ జీవులు, చేతివృత్తిదారుల ప్రతిభ కృషివల్లే, అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కుల గణన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టరేట్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, జిల్లా అటవీ శాఖ అధికారి కిష్ట గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: 20 నెలల పాలనలో.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని.. కళ్లకు కట్టిన సీఎం రేవంత్