Surya Vs Pak Reporter: యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్-2025ను భారత జట్టు ముద్దాడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి పాకిస్థాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మ్యాచ్ అనంతరం యువ బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. టోర్నమెంట్లో పాకిస్థాన్తో మ్యాచ్ల సందర్భంగా వివాదాలు, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మోహ్సిన్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించిన నేపథ్యంలో, పాకిస్థాన్కు చెందిన ఓ మీడియా రిపోర్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యను టార్గెట్గా చేసుకున్నాడు. ఆవేశపూరితంగా ఒక ప్రశ్న (Surya Vs Pak Reporter) సంధించాడు.
రిపోర్టర్ ప్రశ్న ఇదే..
‘‘మీ జట్టు ఛాంపియన్గా నిలిచింది. బాగా ఆడారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, టోర్నమెంట్లో పాకిస్థాన్ జట్టు విషయంలో మీ ప్రవర్తన సరిగా లేదు. హ్యాండ్షేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత ట్రోఫీ ఫొటో సెషన్కు హాజరు కాలేదు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మీరు (సూర్య) రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తొలిసారి క్రికెట్లోకి రాజకీయాలను తీసుకొచ్చిన తొలి వ్యక్తి మీరేనని అనుకుంటున్నారా?’’ అని పాక్ రిపోర్టర్ తన అక్కసును వెళ్లగగ్గాడు. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకొస్తున్నారంటూ పాక్ మీడియా టీమిండియాపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సదరు పాక్ రిపోర్టర్ ఈ ప్రశ్న అడిగాడు.
Read Also- World’s Tallest Bridge: ప్రపంచంలోనే ఎత్తైన వంతెన.. 2 గంటల ప్రయాణం.. ఇకపై 2 నిమిషాల్లోనే!
గట్టి కౌంటర్ ఇచ్చిన సూర్య
‘‘అంత కోపంగా ఉన్నారేం?, నేను మాట్లాడాలా లేదా? ’’ అంటూ సూర్యకుమార్ యాదవ్ చురకలు అంటించాడు. ‘‘అసలు మీ ప్రశ్నే నాకు అర్థం కాలేదు. నాలుగు ప్రశ్నలు కలిసి ఒకేసారి అడిగారు’’ నవ్వుతూనే ఘాటు బదులిచ్చాడు. ‘‘ నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి, క్రికెట్ను ఫాలో అవుతున్నప్పటి నుంచి ఈ విధంగా ట్రోఫీ అందివ్వకపోవడాన్ని నేను ఏనాడూ చూడలేదు. ఒక ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ ఇవ్వకుండా అడ్డుకోవడం, అది కూడా చాలా కష్టపడి గెలుచుకున్న ట్రోఫీని ఇవ్వకపోవడం నేను చూడలేదు. ట్రోఫీని అందుకోవడానికి మేము సంపూర్ణంగా అర్హులమని నేను భావిస్తున్నాను. ఇంతకన్నా ఎక్కువగా నేనేం చెప్పలేను. మా ట్రోఫీలు మా డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నాయి. నా తోటి 14 మంది ప్లేయర్లు, మా సపోర్ట్ స్టాఫ్ అందరూ మాకు నిజమైన ట్రోఫీలు’’ అని సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్లో సూర్యకుమార్ యాదవ్ ఇచ్చిన ఈ సమాధానంతో పాకిస్థాన్ రిపోర్టర్ నోటి వెంట మాట రాలేదు. సైలెంట్గా కూర్చుండిపోయాడు. ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకుండా తనవెంట తీసుకెళ్లిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ మోహ్సిన్ నక్వీ నిర్ణయాన్ని సూర్య తీవ్రంగా తప్పుబట్టాడు. పాకిస్థాన్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ ఆసక్తికర పరిణామం జరిగింది.
ఇండియన్ ఆర్మీకి నా మ్యాచ్ ఫీజు
ప్రెస్ కాన్ఫరెన్స్లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో ముఖ్యమైన ప్రకటన కూడా చేశాడు. ‘‘నా ప్రకటన వివాదాస్పదం అవుతుందో లేదో నాకు తెలియదు. కానీ, చెప్పేస్తున్నాం. ఆసియా కప్ టోర్నమెంట్లో నాకు దక్కిన మ్యాచ్ ఫీజులు అన్నింటినీ ఇండియన్ ఆర్మీకి విరాళం ఇస్తున్నాను. ఇండియన్ ఆర్మీకి ఇవ్వబోతున్నాను’’ అని సూర్య స్పష్టం చేశాడు.