Arattai App: భారత్కు చెందిన జోహో కార్పొరేషన్ (Zoho Corporation) రూపొందించిన అరట్టై యాప్కు ( Arattai app) ఉన్నపలంగా విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఈ కొత్త మెసేజింగ్ యాప్ను గత 3 రోజుల్లో ప్రతిరోజూ 3,50,000 మంది చొప్పున ఇన్స్టాల్ చేసుకున్నారు. అంతకుముందు రోజుకు 3 వేల మంది డౌన్లోడ్ చేసుకోవడం కూడా గగనంగా ఉండేది. కానీ, అకస్మాత్తుగా ఈ యాప్కు భారీగా జనాదరణ పెరిగింది. యాప్ను తీసుకొచ్చిన తొలినాళ్లతో పోల్చితే ప్రస్తుతం డౌన్లోడ్ చేసుకుంటున్నవారు సుమారుగా 100 రెట్లు పెరిగిపోయారు. గ్లోబల్ కంపెనీల నుంచి ప్రైవసీ సమస్యలు, స్పైవేర్ల ముప్పు పొంచివున్న నేపథ్యంలో దేశీయ ప్లాట్ఫామ్ల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుండడమే ‘అరట్టై యాప్’ ఈ స్థాయిలో ట్రెండింగ్లోకి దూసుకురావడానికి కారణమైంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో హైప్ ఏర్పడడం కూడా యాప్ వినియోగడానికి దోహదపడుతోంది. ఈ సరికొత్త యాప్ను యూజర్లు పెద్ద సంఖ్యలో ఇన్స్టాల్ చేసుకుంటున్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు స్పందిస్తూ, భారతదేశంలో వాట్సప్ (WhatsApp) ప్రత్యామ్నాయాన్ని జనాలు అన్వేషిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. మనదేశంలో భవిష్యత్లో వాట్సప్ కనుమరుగు అవుతుందేమోనని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కామెంట్లు పెడుతున్నారు.
అరట్టై యాప్ ప్రత్యేకత ఏమిటి?
‘అరట్టై’ అనేది తమిళ భాషా పదం. ‘సాధారణ సంభాషణ’ అనేది దీని అర్థం. ఈ యాప్ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన కొత్త యాప్ ఏమీ కాదు. జోహో కంపెనీ 2021లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిజానికి దీనిని ఒక సైడ్ సైడ్ ప్రాజెక్ట్గా ప్రారంభించినప్పటికీ, ప్రస్తుతం ప్రధాన యాప్ మాదిరిగా ట్రెండింగ్గా మారిపోయింది. ఈ యాప్ ఉపయోగించి యూజర్లు వ్యక్తిగతంగా లేదా గ్రూప్ల్లో చాట్ చేసుకోవచ్చు. వాయిస్ మెసేజులు, ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేసుకోవచ్చు. స్టోరీస్ అప్లోడ్ చెయ్యొచ్చు. అంతేనా, బ్రాడ్కాస్ట్ ఛానెల్స్ను కూడా ఉపయోగించుకునే వీలుంది.
ఫీచర్ల విషయాన్ని పక్కనపెడితే ఇది భారతదేశంలో రూపుదిద్దుకున్న యాప్. స్పైవేర్ ముప్పులేని మెసేజింగ్ యాప్. ప్రైవసీకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది. మన దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్న గ్లోబల్ మెసేజింగ్ యాప్లతో పోల్చితే భారతీయులకు ఇది భద్రమైనదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also- Movie Piracy Racket: దేశంలోనే అతిపెద్ద పైరసీ రాకెట్ గుట్టు రట్టు.. వెలుగులోకి సంచలన నిజాలు
ఫీచర్లు ఇవే
నిజానికి అరట్టై యాప్ మెసేజింగ్ యాప్లో విప్లవాత్మక మార్పులతో కూడిన ఫీచర్లు ఏమీ లేవు. ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని యాప్లలోని ఫీచర్ల ఆధారంగానే ఈ యాప్ను డెవలప్ చేశారు. వ్యక్తిగత, గ్రూప్ చాట్లలో టెక్స్ట్, మీడియా, ఫైల్ షేరింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ యాప్లు, ఆండ్రాయిడ్ టీవీలకు కనెక్ట్ చేసుకోవచ్చు. క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు, వ్యాపారుల కోసం అప్డేట్స్, స్టోరీస్, ఛానెల్స్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రైవసీ ఈ యాప్ ప్రధాన ప్రాముఖ్యత అని జోహో ఇదివరకే ప్రకటించింది. స్పైవేర్ ముప్పు, సైబర్ నేరాలు పెరిగిపోయిన నేపథ్యంలో డిజిటల్ సార్వభౌమాధికారం లక్ష్యంగా భద్రతపై దృష్టి సారించినట్టు జోహో ఇదివరకే స్పష్టం చేసింది.
సడెన్గా ఎందుకీ క్రేజ్?
నిజానికి అరట్టై యాప్ 2021 నుంచే యాప్ స్టోర్ల్లో అందుబాటులో ఉంది. కానీ, అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల దేశీయ డిజిటల్ మాధ్యమాలను స్వీకరించాలంటూ దేశ పౌరులకు పిలుపునివ్వడంతో అరట్టై యాప్ ట్రెండింగ్లోకి దూసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ సూచన వచ్చిన వెంటనే యాప్కు పెద్ద సంఖ్యలో డౌన్లోడ్లు పెరిగిపోయాయి. దీంతో, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యాప్ స్టోర్లలో నంబర్ 1 స్థానానికి చేరింది. దీంతో, అరట్టై యాప్పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. దాదాపు వాట్సప్ మాదిరిగానే ఉండడంతో యాప్ మరింత వైరల్గా మారింది.
Read Also- Seethakka: విద్యా రంగంలో కొత్త అధ్యాయం.. సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ.. ఏర్పాటు అక్కడే?