Rohit Future: ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల ఆస్ట్రేలియా పర్యటనకు ఇద్దరినీ ఎంపిక చేయడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో, ఆస్ట్రేలియా వెళ్లే విమానం ఎక్కడం పక్కాగా కనిపిస్తోంది. అయితే, రోహిత్, కోహ్లీ గతేడాది మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత 7 నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, వన్డే జట్టులో చోటు కోసం ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ సత్తా చాటాడు. పాకిస్థాన్పై శతకం సాధించడమే కాకుండా ఆస్ట్రేలియాపై జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ తరపున అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్గా నిలిచాడు.
పేలవంగా రోహిత్ ప్రదర్శన
రోహిత్ శర్మ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీగా దారుణంగా విపలమయ్యాడు. న్యూజిలాండ్పై ఫైనల్ మ్యాచ్లో మినహా పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ విషయంలో సెలక్టర్లు ఏమైనా కఠిన నిర్ణయం తీసుకుంటారా?, లేక, ఎంపిక చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, వన్డే ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి రోహిత్ను (Rohit Future) పక్కనపెడతారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్యాటింగ్పై దృష్టి పెట్టాలే రోహిత్పై బాధ్యతలు లేకుండా చేస్తారా? అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Read Also- Hyderabad: నిషేధిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్.. వాటి విలువ ఎంతంటే?
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత జట్టుని సెలక్టర్లు శనివారం (అక్టోబర్ 4) ఎంపిక చేసే అవకాశం ఉంది. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజున, సెలక్టర్లు సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే, జట్టు ప్రకటన ఎప్పుడు ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ గాయాలతో బాధపడుతున్నందున వారిద్దరూ అందుబాటులో ఉండబోరని భావిస్తున్నారు. ఇక, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆసియా కప్ ముగిసిన మూడు రోజుల్లో టెస్ట్ సిరీస్లో ఆడుతున్నాడు. కాబట్టి, అతడి శరీరక అలసటను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వవచ్చనే అంచనాలున్నాయి. వన్డేలు, లేదా టీ20 ఏదో ఒక ఫార్మాట్, లేదా రెండింటిలోనూ విశ్రాంతి తీసుకోవాలని సూచించే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు, వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు ఎలా ఉంటుంది?, ఎవరెవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Also- Viral video: మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది
కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మీ ఇద్దరూ 2027లో దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే వరల్డ్ కప్ వరకూ కొనసాగాలని భావిస్తున్నారు. అప్పటివరకు ఆటగాళ్ల ఫిట్నెస్, క్రికెట్కు టచ్లో ఉండడం సవాళ్లుగా మారే అవకాశం ఉంది. అయితే, వీరిద్దరి భవితవ్యం గురించి బీసీసీఐ ఇప్పుడే దృష్టి పెట్టే ఉద్దేశం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం 2026లో భారత్ వేదికగా జరగబోయే టీ20 వరల్డ్ కప్పైనా, 2025లో స్వదేశంలో జరగనున్న నాలుగు టెస్టుల్లో రాణించి డబ్ల్యూటీసీ (WTC) పాయింట్లు సాధించడంపై బీసీసీఐ సెలక్టర్లు దృష్టిసారించినట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
బీసీసీఐ వర్గాల ప్రకారం, ఈ ఏడాది ఇంకా కేవలం ఆరు వన్డేలు మాత్రమే మిగిలివున్నాయి. ఆస్ట్రేలియాలో మూడు, ఈ ఏడాది చివరిలో భారత్ ఆతిథ్యంలో న్యూజిలాండ్తో మూడు వన్డేలు జరగనున్నాయి. ఇదిలావుంచితే, జియో హాట్స్టార్ విడుదల చేసిన వన్డే సిరీస్ ప్రోమో వీడియోలో కోహ్లీ, రోహిత్ ఫొటోలు ఉన్నాయి. దీంతో, వారిద్దరికీ వన్డే సిరీస్లో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
