Rashid Khan: ఆసియా కప్-2025 ప్రారంభానికి కొన్ని రోజుల ముందు అఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. యూఏఈ వేదికగా ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్,యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో అదరగొడుతున్నాడు. తాజాగా, సోమవారం రాత్రి అఫ్ఘనిస్థాన్ వర్సెస్ యూఏఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చెలరేగాడు. యూఏఈని 38 పరుగుల తేడాతో ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఈ లెగ్ స్పిన్నర్ 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీశాడు. దీంతో, అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా చరిత్ర నెలకొల్పాడు.
తాజాగా, యూఏఈపై తీసిన 3 వికెట్లతో కలుపుకొని టీ20ల్లో అతడు సాధించిన మొత్తం వికెట్ల సంఖ్య 165కు చేరింది. దీంతో, 164 వికెట్లతో ఇన్నాళ్లూ అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ (164) రికార్డును రషీద్ ఖాన్ అధిగమించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 165 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్గా నిలిచాడు.
Read Also- Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు
కాగా, యూఏఈ-అఫ్ఘనిస్థాన్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 స్కోర్ సాధించింది. ఇబ్రాహీం జద్రాన్ (63), ఓపెనర్ సెదీక్ఉల్లా అటల్ (54) అర్ధశతకాలు సాధించి కీలకపాత్ర పోషించారు. 189 పరుగుల భారీ టార్గెట్తో బ్యాటింగ్ ఆరంభించిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 150/8 మాత్రమే సాధించింది. దీంతో, ఆఫ్ఘనిస్థాన్ ఘనవిజయం సాధించింది.
అఫ్ఘనిస్థాన్ స్పిన్ బౌలింగ్ యూఏఈ జట్టును చుట్టుముట్టేసింది. రషీద్తో పాటు షరఫుద్దీన్ అష్రఫ్ (3/24) అదరగొట్టాడు. దీంతో, యూఏఈ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది. ఈ మ్యాచ్లో యూఏఈ ఓడినప్పటికీ ఆ టీమ్ కెప్టెన్ మహ్మద్ వసీమ్ అద్భుతంగా రాణించాడు. వ్యక్తిగత స్కోరు 20 పరుగుల వద్ద లభించిన లైఫ్ తర్వాత చెలరేగాడు. 37 బంతులు ఎదుర్కొని 67 పరుగులు బాదాడు. ఇందులో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. ఆరంభంలో ఇబ్బందిపడిన రషీద్.. తన ఇన్నింగ్స్లో చివరి 50 పరుగులను 25 బంతుల్లోనే సాధించాడు. వసీమ్, రషీద్ ఖాన్ బౌలింగ్లలో స్ట్రెయిట్ సిక్సర్లు కొట్టి ఆశ్చర్యపరిచాడు.
Read Also- Kim Jong-un: ట్రైన్లో చైనా బయలుదేరిన ఉత్తరకొరియా అధినేత కిమ్.. కీలక పరిణామం జరగబోతోంది!
కాగా, ఆదివారం తూర్పు అఫ్గానిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం తీవ్రతకు దాదాపు 800 మంది మృతి చెందగా, 2,500 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రకృతి విషాదం పట్ల ఇరు జట్లు మ్యాచ్కు ముందు సంతాపం తెలిపాయి. మ్యాచ్కు ముందు ఒక నిమిషంపాటు మౌనంపాటించాయి. అంతేకాదు, బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ ధరించి ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. ఆసియా కప్కు ముందు సన్నాహకంగా అఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, యూఏఈ ముక్కోణపు సిరీస్ ఆడుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఆధిక్యంలో ఉంది. పాక్ ఇప్పటికే అఫ్గానిస్థాన్, యూఏఈలను ఓడించింది. మంగళవారం పాక్, అఫ్గానిస్తాన్ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. కాగా, సెప్టెంబర్ 9న యూఏఈ వేదికగా ఆసియా కప్-2025 ప్రారంభం కానుంది.