Kim Jong-un: ఎప్పుడు చూసినా బాలిస్టిక్ మిసైళ్లు, ఇతర ఆయుధాల తయారీను పర్యవేక్షిస్తూ బిజీగా ఉండే ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్కు (Kim Jong-un) ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చర్యలను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటుంది. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఓ ప్రైవేట్ రైలు ద్వారా ఆయన చైనా బయలుదేరారు. చైనా రాజధాని బీజింగ్లో జరిగే సైనిక పరేడ్కు ఆయన హాజరుకానున్నారు. అరుదైన ఈ విదేశీ పర్యటన ద్వారా చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లతో తనకు ఉన్న సంబంధాలను ప్రపంచానికి కిమ్ జాంగ్ ఉన్ మరోసారి చాటిచెప్పారు.
కాగా, చైనాలో జరగనున్న సైనిక పరేడ్ కోసం కిమ్ జాంగ్ ఉన్ సోమవారం రాత్రి ప్యాంగ్యాంగ్ నుంచి బయలుదేరారు. ఆయనతో పాటు ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి చో సన్-హుయ్, ఉన్నతాధికారులు కూడా చైనా వెళ్తున్నారు. ఈ విషయాన్ని ఉత్తరకొరియా అధికారిక మీడియా సంస్థ కోరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) మంగళవారం ఉదయం వెల్లడించింది. కిమ్ ప్రయాణిస్తున్న రైలు మంగళవారమే చైనా చేరుతుందని విదేశాంగమంత్రి చెప్పినట్టు ఉటంకించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చైనాలో నిర్వహించే పరేడ్ను జిన్పింగ్, పుతిన్లతో కలిసి కిమ్ జాంగ్ ఉన్ వీక్షించే అవకాశం ఉంది. కిమ్ జాంగ్ ఉన్ 2023లో చివరి విదేశీ పర్యటన చేశారు. ఆ ఏడాది రష్యా వెళ్లిన ఆయన.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక, చైనాకు చివరిసారిగా 2019 జనవరిలో వెళ్లి వచ్చారు.
Read Also- Kavitha Suspended: పెను సంచలనం.. బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. అధికారిక ప్రకటన విడుదల
ఉత్తరకొరియాకు చైనా మిత్రదేశం
ఉత్తర కొరియాకు చైనా కొన్నేళ్లుగా మిత్రదేశంగా కొనసాగుతోంది. చాలా విషయాల్లో మద్దతుగా నిలుస్తోంది. అమెరికా, దాని మిత్రదేశాలు ఆ దేశంపై ఆంక్షలు కొనసాగిస్తుండగా, చైనా ఇస్తున్న మద్దతు కారణంగా ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ నిలబడుతోంది. చైనాతో పాటు రష్యాతో కూడా కిమ్ మరింత సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా ఆయుధాలు, సైనికులను సమకూర్చుతోందని అమెరికా, దక్షిణ కొరియా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జిన్పింగ్, పుతిన్లతో కలిసి కిమ్ ఒకే వేదికగా పంచుకుంటే, మరింత శక్తివంతమైన సంకేతంగా మారనుందని అంతర్జాతీయ రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ మూడు దేశాల నాయకుల మధ్య బలమైన స్నేహపూర్వక సంబంధాలు నెలకొన్నట్టు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. అమెరికా ఆధిపత్యాన్ని కలిసికట్టుగా సవాలు చేయాలనే ఉద్దేశాన్ని ఈ పర్యటన ప్రస్ఫుటం చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, చైనా పర్యటనతో కిమ్.. అంతర్జాతీయ రాజకీయాల్లో తన స్థాయిని పెంచుకునే అవకాశం ఉందన్నారు.
2019 జూన్ తర్వాత కిమ్ జాంగ్ ఉన్, జిన్పింగ్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. 2019కి ముందు చూస్తే, అమెరికా, దక్షిణ కొరియా దేశాలతో సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి చైనా మద్దతు కోరారు. ఇందుకోసం కేవలం 10 నెలల వ్యవధిలోనే నాలుగుసార్లు చైనా వెళ్లి కీలక సంప్రదింపులు జరిపారు.