BCCI-BCB: అనూహ్య పరిణామాల మధ్య భారత్, పొరుగు దేశం బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు సన్నిగిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లా స్టార్ క్రికెట్ ప్లేయర్, పేస్ బౌలర్ ముస్తాఫిజర్ రహ్మన్ను టీమ్ నుంచి రిలీజ్ చేయాలంటూ కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని బీసీసీఐ శనివారం నాడు (BCCI-BCB) ఆదేశింది. తదనుగుణంగా కేకేఆర్ కూడా ప్రకటన విడుదల చేసింది. తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి గెంటివేయడంపై బంగ్లాదేశ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. బీసీసీఐ నిర్ణయానికి కౌంటర్గా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్లో ఆడేందుకు ముస్తాఫిజుర్కు గతంలో జారీ చేసిన ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) రద్దు చేయాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిర్ణయించింది. ఐపీఎల్లో ఆడేందుకు ముస్తాఫిజుర్కు బీసీసీఐ తిరిగి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆడేందుకు అవకాశం లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతే కారణం
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహ్మాన్ను రిలీజ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ ప్రకటన కూడా చేసింది. కాగా, కోల్కతా నైట్ రైడర్స్ తనను రిలీజ్ చేయడంపై ముస్తాఫిజుర్ రహ్మాన్ స్పందిస్తూ, ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు నుంచి రిలీజ్ చేస్తే తాను మాత్రం ఏం చేయగలనని వాపోయాడు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా ఇలా జరిగిందంటూ నిరాశ వ్యక్తం చేసినట్టుగా కథనాలు వచ్చాయి. కాగా, గత నెలలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. కనీస ధర కేవలం రూ.2 కోట్లే అయినప్పటికీ, కోల్కతా నైట్ రైడర్స్ రూ.9.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది.
టీ20 వరల్డ్ కప్ కోసం భారత్ రాకూడదనే యోచన!
ఫిబ్రవరి నెల నుంచి భారత్ వేదికగా టీ20 వరల్డ్ కప్-2026 షురూ కానుంది. అయితే, ఈ టోర్నమెంట్లో ఆడేందుకు భారత్కు రాకూడదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు యోచిస్తోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. పాకిస్థాన్ మాదిరిగా, తమ మ్యాచ్లు అన్నింటినీ శ్రీలంకలో ఆడతామంటూ కోరాలని చూస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఇదే విషయమై ఐసీసీ (ICC), బీసీసీఐలకు (BCCI) లేఖలు రాయాలని భావిస్తున్నట్టు సమాచారం.
Read Also- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ స్పందనలు ఇవే

