IPL-Bangladesh: పొరుగుదేశం బంగ్లాదేశ్కు చెందిన స్టార్ క్రికెటర్, పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడాన్ని ఆ దేశ ప్రభుత్వం అస్సలు జీర్ణించుకోలేపోతోంది. పలు విధాలుగా తన అక్కసును వెళ్లగక్కే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో సోమవారం నాడు అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించింది. బంగ్లాదేశ్లో ఐపీఎల్ ప్రసారాలపై నిరవధిక నిషేధం (IPL-Bangladesh) విధించింది. ఐపీఎల్ ప్రమోషన్ కార్యక్రమాలపై కూడా బ్యాన్ విధించింది. ఈ మేరకు ఆ దేశ మధ్యంతర ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేసింది. ఐపీఎల్కు సంబంధించిన ప్రసారాలు, ప్రమోషన్లు, ఈవెంట్ కవరేజీలను సస్పెండ్ చేస్తున్నట్టుగా వివరించింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఈ మేరకు కార్యకలాపాలను నిలిపివేయాలంటూ సంబంధిత భాగస్వాములకు స్పష్టం చేసింది.
సహేతుకమైన కారణం లేకుండానే ముస్తాఫిజుర్ రిలీజ్ చేయడానికి షాక్కు గురిచేసిందని, అలాగే బంగ్లాదేశ్ ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించిందని పేర్కొంది. ప్రజల సెంటిమెంట్కు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వం వివరించింది. కాగా, ముస్తాఫీజుర్ను ఐపీఎల్ నుంచి రిలీజ్ చేయడం వెనుక సరైన కారణం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్టుగా తెలిసింది. ఇదే అభిప్రాయాన్ని బీసీసీఐకి కూడా తెలియజేసినట్టుగా సమాచారం. బీసీసీఐ ఆదేశాల మేరకు ముస్తాఫిజుర్ను రిలీజ్ చేస్తున్నట్టుగా కోల్కతా నైట్ రైడర్స్ ప్రకటన చేయడాన్ని బంగ్లాదేశ్ సీరియస్గా తీసుకుంది.
టీ20 వరల్డ్ కప్పైనా పేచీ!
భారత్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే విషయంలోనూ బంగ్లాదేశ్ పేచీలు పెట్టాలని చూస్తోంది. భద్రతా కారణాలను చూపి, తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని కోరబోతున్నట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఐసీసీని సంప్రదించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు యోచిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ను సైతం బాయ్కాట్ చేయవచ్చంటూ కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
Read Also- Kavitha Emotional: వ్యక్తిగా వెళ్తున్నా.. శక్తిగా మళ్లీ తిరిగొస్తా.. మండలిలో కవిత భావోద్వేగం
బంగ్లాదేశ్లో గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఆమె భారత్లో తలదాచుకుంటుండడం, మరోవైపు, బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ విద్యార్థి సంఘం నేత మహ్మద్ హత్య వెనుక భారత్ ఉందని, భారత ఇంటెలిజెన్సీ సంస్థలే చంపాయని బంగ్లాదేశ్ ప్రజలు, ప్రభుత్వం నమ్ముతున్న పరిస్థితులు నెలకొన్నాయి. భారత్పై ద్వేషాన్ని అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై చూపుతున్నారు. కేవలం 2 వారల్లోనే ముగ్గురు హిందూ వ్యక్తులు హత్యలకు గురయ్యారు. దీంతో, బంగ్లాదేశ్పై భారత్లోనూ నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని, బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ను రిలీజ్ చేయడమే ఉత్తమమని బీసీసీఐ భావించింది. మొత్తంగా భారత్ – బంగ్లాదేశ్ మధ్య సన్నిగిల్లిన దౌత్య సంబంధాలు, క్రికెట్ సంబంధాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

