Ind Vs Pak Toss: ఆసియా కప్-2025లో సూపర్-4 దశ మ్యాచ్లు షురూ అయ్యాయి. దాయాదులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో టాస్ (Ind Vs Pak Toss) పడింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి పాకిస్థాన్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
తుది జట్లు ఇవే
భారత్: అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్: సైమ్ అయూబ్, సహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
సూర్య ఏమన్నాడంటే?
భారత జట్టు కూర్పులో కీలకమైన మార్పులు జరిగాయి. పేసర్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి తిరిగొచ్చారు. టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ‘‘మేము బౌలింగ్ చేస్తాం. ఇది మంచి పిచ్గా కనిపిస్తోంది. నిన్ తడిగా (డ్యూ) ఉంది. లీగ్ దశ నుంచే మేము సూపర్ -4 (నాకౌట్) మ్యాచ్ల్లా ఆడుతున్నాం. కాబట్టి, ఎలాంటి మార్పూ లేదు. అబూదాబిలోని పిచ్తో పోల్చితే ఇది పూర్తిగా భిన్నమైనది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చారు. అర్ష్దీప్, హర్షిత్ రాణా స్థానాల్లో తీసుకున్నాం’’ అని చెప్పాడు.
పాకిస్థాన్ కెప్టెన్ స్పందన ఇదే
టాస్ గెలిచుంటే తాము కూడా బౌలింగ్నే ఎంచుకునే వాళ్లమని పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా చెప్పాడు. ‘‘ఇది మరో కొత్త మ్యాచ్. కొత్త ఛాలెంజ్. జట్టులోని వాతావరణం ప్రశాంతంగా ఉంది. పిచ్ కొంచెం స్లోగా కనిపిస్తోంది. బ్యాట్తో, బాల్తో మంచి ఆరంభం అందుకోవాలని కోరుకుంటున్నాం. మా జట్టులో రెండు మార్పులు చేశాం. హసన్ నవాజ్, ఖుష్దిల్ షాలను పక్కనపెట్టాం’’ అని సల్మాన్ ఆఘా చెప్పాడు.