Asia Cup Prediction: మరో రెండు రోజుల్లో ఆసియా కప్-2025 మొదలుకానుంది. సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్థాన్, హాంగ్కాంగ్ మధ్య తొలి మ్యాచ్తో టోర్నీ ఆరంభం కానుంది. టోర్నమెంట్ మొదలుకానున్న నేపథ్యంలో ఆసియాలో అత్యుత్తమ క్రికెట్ జట్టు (Asia Cup Prediction) ఏది? అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే, ఆసియా కప్ రూపంలో రెండు వారాల్లోనే తేలిపోనుంది. అంతకంటే ముందే, భారత మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా ఆసియా కప్పై తన అంచనాలను వెల్లడించాడు.
ఆఫ్ఘనిస్థాన్ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని, ఆ జట్టు ఫైనల్కి చేరే అవకాశం చాలా మెండుగా ఉన్నాయని విశ్లేషించాడు. “వాళ్లు ఇప్పటివరకు చాలా బాగా ఆడుతూ వచ్చారు. పెద్దపెద్ద టోర్నమెంట్లలో బాగా రాణించి, ప్రశంసలు అందుకుంటారు. కానీ, టైటిల్ను మాత్రం ఇప్పటివరకు దక్కించుకోలేకపోయారు. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆసియా కప్ గెలవలేదు. టీ20 వరల్డ్కప్లో ఏకంగా సెమీస్కు చేరారు. వన్డే వరల్డ్కప్లోనూ బాగా రాణించారు. ఈ స్థాయిలో రాణించడం నిజంగా గ్రేట్. ఇక, ఇప్పుడు ఆసియా కప్ టైటిల్ గెలుచుకునే అవకాశం గట్టిగానే ఉంది’’ అని నెహ్రా విశ్లేషించాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు.
Read Also- Kishkindhapuri: మొదట్లో వచ్చే ముఖేష్ యాడ్ లేకుండానే బెల్లంకొండ బాబు సినిమా.. మ్యాటర్ ఏంటంటే?
ఆఫ్ఘనిస్థాన్ తుది జట్టులో ఇబ్రహీం జద్రాన్–రహ్మనుల్లా గుర్బాజ్ ఓపెనర్లుగా, ఆ తర్వాత సెదికుల్లా అతల్, దార్వీస్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, కరీం జనత్, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, పేసర్లలో ఫజల్హాక్ ఫరూకీ, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్ చోటు దక్కించుకోవచ్చని నెహ్రా అంచనా వేశాడు. ‘‘ఇప్పుడు నేను చెప్పిన ప్లేయర్లు తుది జట్టులా కనిపిస్తోంది. కానీ, ఆ జట్టుకు చాలా మార్పులు చేసుకునే సామర్థ్యం కూడా ఉంది. ముజీబ్ ఉర్ రెహ్మాన్, అల్లాహ్ ఘజన్ఫర్ కూడా జట్టులోకి రావచ్చు. బౌలింగ్ను మరింత బలోపేతం చేసుకునే వీలుంది. వీరికి అనుకూలమైన పిచ్లు లభిస్తే, టైటిల్ పోటీదారులుగా కచ్చితంగా పరిగణించవచ్చు. భారత్ – శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగొచ్చనే ఈ మధ్యే మాట్లాడాను. కానీ, అలా జరగకపోతే, భారత్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఫైనల్ జరిగే ఛాన్స్ గట్టిగానే ఉంటుంది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు ప్లేయర్లు ఒక్క మ్యాచ్లో 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ చేయగలరని, యూఏఈలోని స్లో పిచ్లకు స్పిన్ బౌలింగ్ సరిపోతుందని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ టీమ్లో అనుభవం ఆటగాళ్లు, యువ ఆటగాళ్ల మధ్య చక్కటి సమతుల్యం ఉందన్నాడు. ముహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ లాంటి అనుభవజ్ఞులు ఒక పక్క, సెదికుల్లా అతల్, ఇబ్రహీం జద్రాన్, గుర్బాజ్ లాంటి యువ ఆటగాళ్లు మరోపక్క ఉన్నారని నెహ్రా మెచ్చుకున్నాడు. హిట్టర్లు, స్థిరంగా ఆడగల ప్లేయర్లు, ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ లాంటి వారు కూడా ఉన్నారని, ఆఫ్ఘనిస్థాన్ ఒక బలమైన, బ్యాలెన్స్డ్ టీమ్ అని కొనియాడాడు.
కాగా, యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో ఆసియాలో టాప్-8 జట్లు తలపడనున్నాయి. టైటిల్ రేసులో ప్రధానంగా ఐదు జట్ల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థా న్, శ్రీలంక, బాంగ్లాదేశ్ ఈ రేసులో ఉన్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్-బీలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఉన్నాయి.