KTR: యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మస్జిద్, ఎవరు ఏం తింటున్నారు? ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో పీఎం మోడీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోడీ గాలికొదిలేశారన్నారు.
రాజకీయాలను నిర్ణయించలేరు?
చైనా(China), జపాన్(Japan), అమెరికా(USA) వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో, పాక్ తో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదన్నారు. శనివారం ముంబైలో జరిగిన ఓ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రావాలన్నారు. “రాజకీయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, మీరే ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరు?” అని యువతకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ(Telangana)లో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్(BRS)ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నారన్నారు. త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉందన్నారు.
Also Read: Manipur attack: జవాన్ల ట్రక్కుపై సాయుధుల దాడి.. ఇద్దరు అస్సాం రైపిల్స్ జవాన్లు కన్నుమూత
రహదారి భద్రతాచర్యలేవి?
పెరుగుతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ప్రభుత్వం ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం అని కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై శనివారం ఫైర్ అయ్యారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం అన్నారు. హైడ్రా(Hydraa) వంటి విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అన్నారు.
వసూలు చేసే కుట్ర
రహదారి భద్రతా సెస్ పేరిట ఒక్కో కొత్త వాహనం కొనుగోలుపై ఏకంగా రెండు నుంచి పదివేల వరకూ అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతికి చెందిన ప్రజానీకాన్ని దగా చేయడమే అన్నారు. రెండేళ్లు కావస్తున్నా ఇవ్వాల్సిన గ్యారెంటీలను గాలికొదిలేసి, చివరికి ప్రజల నుంచే ముక్కుపిండి రూ.270 కోట్లు వసూలు చేసే కుట్రచేస్తే కాంగ్రెస్ సర్కారును ప్రజలు క్షమించరు అన్నారు. పైసా పైసా కూడబెట్టుకుని, అప్పు చేసి మరీ వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు కాంగ్రెస్ సర్కారు ఇకనైనా స్వస్తి పలకాలన్నారు.
Also Read: Konda Surekha: దేవుడి భూములు కబ్జా చేసే వారిపై పీడీ యాక్ట్.. మంత్రి కొండా సురేఖ హెచ్చరిక