GHMC Council Meeting: కౌన్సిల్లో కార్పొరేటర్ల తీరుపై మేయర్ సీరియస్
ఏకవచనంతో సంబోధించడం సభామర్యాద ధిక్కారమే
‘మనమంతా భారతీయులమే’ అంటూ హితవు
ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందే
సీటును అగౌరవపరిస్తే సహించేది లేదని మందలింపు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జీహెచ్ఎంసీ పాలక మండలి సర్వసభ్య సమావేశంలో (GHMC Council Meeting) పలువురు కార్పొరేటర్లు వ్యవహారించిన తీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Mayor Gadwal Vijayalakshmi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ‘జయ జయ హే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, దివంగత కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం తీర్మానాలపై బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడాలని మేయర్ సూచించారు. అయితే, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో కొందరు.. ఇతర సభ్యులనుద్దేశించి ఆమె, ఈమె, నువ్వు అంటూ వ్యాఖ్యానించటాన్ని గమనించిన మేయర్, కల్పించుకొని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Read Also- Anaganaga Oka Raju: జాన్ జిగ్రీస్ అంటూ నవీన్ పోలిశెట్టి మరో వీడియో.. సాలిడ్ అప్డేట్ ఇచ్చాడుగా!
సభా మర్యాదలను కాపాడాల్సిన సభ్యులే సభలో ఏకవచనంతో సంబోధించటం ఏమిటీ?, వందేమాతర గీతాన్ని సామూహికంగా మర్యాదపూర్వకంగా ఆలపించాలంటూ బీజేపీ సభ్యులు అభ్యర్థించిన సమయంలో మజ్లీస్ అభ్యంతరాన్ని తెలపడంపై కూడా ఆమె తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘‘మనం రౌడీలమా?. ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజాప్రతినిధులమా?’’ అని మండిపడ్డారు. 150 ఏళ్లు దాటిన సందర్భంగా వందేమాతర గీతాన్ని కౌన్సిల్ సమావేశంలో ఆలపించాలని బీజేపీ కోరడంతో, బ్రేక్ తర్వాత వందేమాతర గీతంతో పాటు ‘జయ జయహే తెలంగాణ’, జననీ జయకేతనం రాష్ట్రగీతాన్ని కూడా వరుసగా ఆలపించారు. సభ్యులందరూ నిలబడి సామూహికంగా ఈ రెండు గీతాలాపన చేయాలని మేయర్ సూచించారు. అయినా, మజ్లీస్ పార్టీకి చెందిన కొందరు సభ్యులు కనీసం లేచి నిలబడలేదు. పైగా, గీతాలాపన ముగిసిన తర్వాత బీజేపీ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యల పట్ల మజ్లీస్ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు కూడా పోటాపోటీగా నినాదాలు చేయటాన్ని మేయర్ తీవ్రంగా తప్పుబట్టారు.
Read Also- TG Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. మూడు విడతల్లో పోలింగ్
నినాదాలు చేస్తూ కొందరు కార్పొరేటర్లు మేయర్ పొడియం వద్దకు దూసుకురావటంతో మేయర్ వెంటనే మార్షల్స్ను పిలిపించారు. ఆ తర్వాత కొద్దిసేపు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభమైన తర్వాత మేయర్ మాట్లాడారు. ‘వీ ఆర్ ఆల్ ఇండియన్స్. మన జాతీయ, రాష్ట్ర గీతాన్ని గౌరవించుకోవాలి. ప్రజాప్రతినిధులైన మనం ఒకరినొకరం గౌరవించుకోవాలి. ఇతరులకు రోల్ మోడల్గా నిలవాలి’’ అని సూచించారు. మేయర్ సీటును, సభా మర్యాదలను అగౌరవ పరిస్తే సహించేది లేదని, అలాంటి వారిని బయటకు పంపాల్సి వస్తుందని మేయర్ వ్యాఖ్యానించారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేయి పైకి ఎత్తవచ్చునని, ఒకరికి మాట్లాడే అవకాశమిచ్చిన తర్వాత ఇతర సభ్యులు కామెంట్ల చేయటం సరికాదని, మేయర్ సీట్లో ఉన్న తాను ఏం చేయాలో తనకు తెలుసునని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరు మాట్లాడుతున్నపుడు అనవసరంగా జోక్యం చేసుకునే సభ్యులను కూర్చోమంటే వెంటనే కూర్చోవటం సభ్యా మర్యాద అని మేయర్ వ్యాఖ్యానించారు.

