AV Ranganath: హైడ్రా అంటే భయం వద్దని, బాధితులకు అసలైన అభయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. హైడ్రా (Hydra) పేరుతో అపోహలు సృష్టించడం, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని సుద్దకుంట చెరువు చెంత ఉన్న ద్వారకానగర్ నివాసితుల ఫిర్యాదుల మేరకు కమిషనర్ క్షేత్ర స్థాయి పరిశీలన నిర్వహించారు. సుమారు గంట పాటు పర్యటించి స్థానికులతో మాట్లాడి, వారి సందేహాలను నివృత్తి చేశారు.
Also Read: AV Ranganath: చెరువుల పూర్తి స్థాయి పునరుద్దరణే అసలైన పరిరక్షణ : హైడ్రా కమిషనర్ రంగనాధ్
అక్రమ మార్కింగ్లపై ఆగ్రహం
‘సుద్దకుంట చెరువు చెంత తాము 30 ఏళ్లుగా నివాసాలు నిర్మించుకుని ఉంటున్నాం. ఇప్పుడు మా నివాసాలు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తున్నాయంటూ హైడ్రా పేరు చెప్పి కొందరు బెదిరిస్తున్నారు. దీని వల్ల నెలల తరబడిగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఎంతమంది అధికారులను కలిసినా సరైన సమాధానం రాలేదు. దీంతో హైడ్రాకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాం’ అని స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు ఎఫ్టీఎల్ మార్కింగ్ పేరుతో ఇళ్లపై నెంబర్లు వేసి భయాందోళనలకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
1990లో ఈ చెరువుకు-నివాసాలకు మధ్య రోడ్డు వేసిన విషయాన్ని కూడా స్థానికులు గుర్తు చేశారు. అయినప్పటికీ రోడ్డును కూడా ఎఫ్టీఎల్లో చూపించి స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారని కొందరు స్థానిక అధికారులపై ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఏవీ రంగనాథ్.. ఇళ్లపై వేసిన మార్కింగ్లను పరిశీలించారు. అక్రమంగా ఇళ్లపై మార్కింగ్ వేసి భయభ్రాంతులకు గురి చేసిన హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులపై చర్యలకు సిఫార్సు చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. 30 ఏళ్ల నుంచి నివాసాలు ఉంటున్న వారి జోలికి వెళ్లడం ఏమిటి? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానంపై క్లారిటీ
హైడ్రాను 2024 జులై 19న ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఈ తేదీకి ముందు నిర్మించి, నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లమని కమిషనర్ మరోసారి స్పష్టం చేశారు. చెరువు చెంత ఉన్న నివాసాల వారికి ఎలాంటి చింత అవసరం లేదన్నారు. ఈ చెరువుకు 2014లోనే 3.16 ఎకరాల మేర చెరువుందని హెచ్ఎండీఏ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, దాని ప్రకారమే చెరువు హద్దులు నిర్ణయించి కాపాడతామని హామీ ఇచ్చారు. చెరువు హద్దులు మార్చివేసి వేరొక వైపు చెరువు ఉన్నట్లుగా చూపించి ఇళ్లపై మార్కింగ్ వేసిన అధికారులపై హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు ప్రతిపాదించిన ఫైనల్ నోటిఫికేషన్ ప్రతిపాదనలు పక్కన పెట్టి, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
కఠిన శిక్షలు
హైడ్రా పేరు చెప్పి వసూళ్లు చేస్తున్న ఘటనలు కూడా తమ దృష్టికి వస్తున్నాయని, అలాంటి విషయాలను సహించేది లేదని కమిషనర్ తేల్చిచెప్పారు. లేనిపోని గందరగోళం సృష్టించి బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలు ఉంటాయని కమిషనర్ అల్టిమేటం జారీ చేశారు. రంగనాథ్ ఆదేశాల మేరకు ఇళ్లపై వేసిన మార్కింగులను హెచ్ఎండీఏ సంబంధిత అధికారులు వెంటనే తొలగించారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ హైడ్రా కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: AV Ranganath: కబ్జాల పాలైన భూములను కాపాడటమే హైడ్రా లక్ష్యం : కమిషనర్ రంగనాధ్
