Shreyas Iyer: ఇండియా-ఏ టీమ్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండవ టెస్ట్ మ్యాచ్ (ఫస్ట్-క్లాస్) ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు టీమిండియా-ఏ కెప్టెన్సీతో పాటు జట్టు నుంచి స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అనూహ్యంగా వైదొలిగాడు. చివరి నిమిషంలో అయ్యర్ తప్పుకోవడంతో అతడి స్థానంలో టీమ్ కెప్టెన్గా ధ్రువ్ జురేల్ను నియమిస్తూ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటన చేసింది. అయితే, అయ్యర్ తప్పుకోవడానికి గల కారణాన్ని మాత్రం మేనేజ్మెంట్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇది అయ్యర్ వ్యక్తిగత కారణమంటూ జతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అవును, శ్రేయస్ అయ్యర్ బ్రేక్ తీసుకున్నాడని సంబంధిత వర్గాలు నిర్ధారించాయి. తిరిగి ముంబైకి వెళ్లిపోయాడని వివరించాయి. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే రెండో టెస్టులో పాల్గొనబోనంటూ ఇప్పటికే సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చాడని తెలిపారు. ఆస్ట్రేలియా-ఏ టీమ్తో జరిగే రెండో టెస్టుకు అందుబాటులో లేకపోయినా, వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్కు సెలక్టర్లు అతడిని పరిగణనలోకి తీసుకుంటారని, రేసులోనే ఉంటాడని సంబంధిత వర్గాలు తెలిపినిట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. ఈ మేరకు ఓ అధికారి చెప్పారని ఉటంకించింది.
Read Also- H1B Exemption: హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నుంచి వారికి మినహాయింపు.. సుముఖంగా ఉన్న ట్రంప్!
కాగా, ఆస్ట్రేలియా-ఏ టీమ్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో శ్రేయర్ అయ్యర్ ఆడాడు. ఆ మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే, రెండు ఇన్నింగ్స్ల్లోనూ 8, 13 పరుగులే చేసి తీవ్రంగా నిరాశ పరిచాడు. స్పిన్నర్ కోరీ రోచికోలి బౌలింగ్లో అంపైర్ తప్పుడు నిర్ణయాలకు శ్రేయర్ అయ్యర్ బలయ్యాడు. ఈ మ్యాచ్లో వ్యక్తిగత ప్రదర్శన విషయంలో అయ్యర్ విఫలమైనప్పటికీ, ఇండియా-ఏ అద్భుతంగా రాణించింది. ఆస్ట్రేలియా 532 పరుగుల స్కోర్ సాధించగా, ఇండియా-ఏ బ్యాటర్లు 531 పరుగులు సాధించి ధీటుగా పోటీ ఇచ్చారు.
ఆసియా కప్కు ఎంపికవ్వని అయ్యర్..
ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో అదరగొట్టినప్పటికీ శ్రేయస్ అయ్యర్ను సెలెక్టర్లు విస్మరించారు. ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్కు ఎంపిక చేయలేదు. అంతేగాదు, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్-2025కి కూడా సెలక్ట్ చేయలేదు. కాగా, సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులు, టీ20లకు గుడ్బై చెప్పారు. దీంతో, సీనియర్ల పోటీ లేకపోవడంతో అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన ప్లేయర్గా కొనసాగాలని అయ్యర్ భావిస్తున్నాడు. ఇప్పటికే వన్డే టీమ్లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గతేడాది టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. కానీ, టెస్ట్, టీ20 ఫార్మాట్లలో సెలెక్టర్లు అతడికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. సెలక్టర్ల నుంచి సవాళ్లే ఎదురవుతున్నాయి. త్వరలోనే జరగబోయే సిరీస్లకు అయినా ఎంపిక చేస్తారో లేదో చూడాలి. అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందే త్వరలోనే సెలక్టర్లు జట్టుని ఎంపిక చేయనున్నారు.
Read Also- Crime News: జోగిపేటలో దారుణం.. పండ్ల కోసం వెళ్లి యువకుడు మృతి