HYD News:
పంద్రాగస్టు నజరానా
15 నుంచి రూ.5 కే ఇందిరమ్మ టిఫిన్స్
పేదల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ స్కీమ్
తొలి దశగా 60 కేంద్రాల్లో ప్రారంభం
చిరుధాన్యాలతో కూడిన టిఫిన్స్ మెనూ సిద్ధం
తొలి దశగా రూ.11.43 కోట్లతో 130 స్టాల్స్
ఒక్కో టిఫిన్పై రూ.14 చెల్లించనున్న బల్దియా
సీఎం చేతుల మీదుగా ప్రారంభించే యోచన
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో (HYD News) అర్ధాకలితో అలమటించే వారి కడుపు నింపేందుకు అన్నపూర్ణ స్కీమ్ పేరిట కేవలం రూ.5లకే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ.. పేదల ఆకలి తీర్చేందుకు మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని పేద, మధ్య తరగతి ప్రజలకు, కార్మికులు చాలా మంది వివిధ రకాల పనులు చేసుకునేందుకు ఉదయాన్నే బయల్దేరి ఆకలితోనే పనులు మొదలు పెడుతున్నట్టు గుర్తించిన జీహెచ్ఎంసీ వారికి కేవలం రూ.5 కే టిఫిన్ అందించేందుకు సిద్దమైంది. ఈ స్కీమ్ను స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆగస్టు15 నుంచి ఇందిరమ్మ టిఫిన్స్ పేరుతో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ యోచిస్తున్నట్లు సమాచారం.
తొలి దశగా 60 స్టాళ్లలో ఇందిరమ్మ టిఫిన్స్2ను అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యంగా మహానగరంలో రోజురోజుకి షుగర్ పేషెంట్లు పెరిగిపోతున్నందున ఏకంగా షుగర్ లెస్, పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు బల్దియా సిద్దమైంది. ఒక్కోరోజు ఒక వెరైటీ టిఫిన్స్ అందించాలని భావిస్తుంది. వారంలో సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజులకు ఆరు రకాల పౌష్టికమైన టిఫిన్స్ అందించేందుకు జీహెచ్ఎంసీ మెనూను సిద్దం చేసుకుంది. తొలి దశగా రూ.11.43 కోట్ల వ్యయంతో సిటీలో 130 స్టాళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ప్రతి టిఫిన్ స్టాల్లో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను కఠినంగా పాటిస్తూ, పేదలకు పౌష్టికాహారం అందించడమే ధ్యేయంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బస్తీవాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులకు ఈ స్కీమ్ ఒక వరంలా మారనుందని, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Also- Nisar: నిప్పులు చిమ్ముతూ.. నింగిలోకి నిసార్
సింహాభాగం ఖర్చు బల్దియాదే
ప్రస్తుతం హరే రామ హరే కృష్ణ మూవ్మెంట్తో కలిసి రూ.5 కే నాణ్యమైన, పౌష్టికమైన భోజనాన్ని అందిస్తున్న జీహెచ్ఎంసీ… రూ.5 కే టిఫిన్స్ అందించేలా మరోసారి హరే రామా హరే కృష్ణ మూవ్మెంట్తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పూర్తిగా చిరుధన్యాలతో తయారు చేయనున్న ఈ ఒక్కో టిఫిన్కు రూ.19 ఖర్చవుతుండగా, ఇందులో రూ.5 మాత్రమే ప్రజల నుంచి వసూలు చేయనుంది. మిగిలిన రూ.14ను జీహెచ్ఎంసీయే భరించనుంది. ఆరోగ్యమే లక్ష్యంగా మెనూను కూడా ఇప్పటికే రూపొందించారు. రూ.5 కే టిఫిన్స్ స్కీమ్ను ఆరోగ్య పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా జీహెచ్ఎంసీ మిల్లెట్స్తో తయారు చేసే టిఫిన్ల మెనూను సిద్దం చేసింది. వారంలో 6 రోజుల పాటు ఉదయం అందించే టిఫిన్ ఐటెమ్స్, వాటితో పాటు ఇచ్చే ఇతర ఐటెమ్స్ల వివరాలు రోజు వారీగా ఇలా ఉన్నాయి.
రోజు అల్పాహారం
సోమవారం – మిల్లెట్ ఇడ్లీ (3), సాంబార్, చట్నీ/పొడి.
మంగళవారం – మిల్లెట్ ఉప్మా, సాంబార్, మిక్స్ చట్నీ.
బుధవారం – పొంగల్, సాంబార్, చట్నీ.
గురువారం – ఇడ్లీ (3), సాంబార్, చట్నీ.
శుక్రవారం – పొంగల్, సాంబార్, చట్నీ.
శనివారం – పూరీ (3), ఆలూ కూర్మా.
Read Also- Tariff on India: భారత్పై ట్రంప్ ‘టారిఫ్ బాంబ్’.. సంచలన ప్రకటన