Vakiti Srihari: ఈ నెల చివరికల్లా చేపపిల్లల పంపిణీ పూర్తి కావాలని, ప్రజాప్రతినిధులను కలుపుకొని పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ చేపలను తింటే వచ్చే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలన్నారు. గత ప్రభుత్వపాలనలో చేప పిల్లల పంపిణీలో అక్రమాలు జరిగాయని, మత్స్యశాఖపై ఉన్న అభియోగాన్ని మార్చేందుకు ప్రతి చెరువు వద్ద చేపపిల్లల పంపిణీ వివరాలు తెలిసేలా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Also Read: Vakiti Srihari: యువతలో నైపుణ్యం పెంచడమే లక్ష్యం
ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నియమ నిబంధనలు అనుగుణంగా టీ మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయం పెంచాలని, ప్రతి నియోజకవర్గంలో ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మార్కెట్ కోసం ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు కేటాయించాలన్నారు. పలు రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల కూర అమలును పరిశీలిస్తున్నామన్నారు. తెలంగాణలోనూ అమలుపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామన్నారు. చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సూచించారు. ప్రతి వారం ఇందుకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్ లో మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
Also ReadMinister Vakiti Srihari: తెలంగాణ సాదనలో సోనియా గాంధీ మద్దతు కీలకం: మంత్రి వాకిటి శ్రీహరి
