Emergency delivery:
ఇనుగుర్తి, స్వేచ్ఛ: పురిటి నొప్పులతో విలవిల్లాడిన ఓ మహిళకు 108 సిబ్బంది పురుడు (Emergency delivery) పోశారు. సకాలంలో స్పందించడంతో ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఇనుగుర్తి మండలం పెద్ద తండాకు చెందిన నూనావత్ యాకమ్మ నిండు గర్భవతి. ఆదివారం ఉదయం సమయంలో యాకమ్మకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో, 108 వాహన సహాయం కొరకు సంప్రదించారు. అంబులెన్స్ సిబ్బంది ఇంటికి చేరుకునే సమయానికి యాకమ్మకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో, 108 సిబ్బంది అంబులెన్స్లోనే పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నూనవత్ యాకమ్మను మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాగా, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. పురిటినొప్పులతో బాధపడుతున్న యాకమ్మకు సరైన సమయంలో వైద్య సహాయం అందించిన అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ ప్రభాకర్, పైలెట్ వెంకన్నలకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also- Crime News: బావిలో భర్త డెడ్బాడీ.. కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి
గ్రామీణ ప్రాంతాల్లో పురిటి కష్టాలు
గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండటం, రవాణా సౌకర్యాల లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో తగిన వైద్యసహాయం పొందలేక నానా అవస్థలు పడుతుంటారు. మరోవైపు, నిరక్షరాస్యత, అవగాహనలేమి కారణంగా గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైద్య పరీక్షలు కూడా సరిగా ఉండవు. పోషకాహారం లోపం, రక్తహీనత వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. పురిటి నొప్పుల సమయంలో అంబులెన్స్ అందుబాటులో లేకపోకపోవడంతో చాలామంది గర్బణీలు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మహిళలు ఇంట్లోనే ప్రసవించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సరైన శుభ్రత, వైద్య పరికరాల లేమి కూడా తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రమాదం చూపుతోంది. అశాస్త్రీయ నమ్మకాల వల్ల కూడా కొందరు సరైన వైద్యం తీసుకోరు. ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం కొన్ని ప్రయోజనాలు పొందలేకపోతుంటారు. ఈ సమస్యలను అధిగమించాలంటే ఆరోగ్య సేవల విస్తరణ, అవగాహన కార్యక్రమాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం అత్యంత అవసరంగా ఉంది.
Read Also- Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు