IND vs NZ 1st ODI: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ (IND vs NZ 1st ODI) షురూ అయ్యింది. గుజరాత్లోని వడోదర వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో టాస్ పడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు.
నితీష్ రెడ్డికి దక్కని చోటు
భారత తుది జట్టులో శ్రేయాస్ అయ్యర్ తిరిగి అడుగుపెట్టాడు. అయితే, తెలుగు ప్లేయర్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటుదక్కలేదు. చోటు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటుదక్కింది.
న్యూజిలాండ్ టీమ్లో డేవోన్ కాన్వే, హెన్రీ నికోలస్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ హేయ్ (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్వెల్ (కెప్టెన్), జాకరీ ఫౌల్క్స్, క్రిస్టియాన్ క్లార్కే, కైల్ జమీసన్, ఆదిత్య అశోక్ చోటుదక్కించుకున్నారు.
ఇది డిఫరెంట్ కాంబినేషన్: గిల్
టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్గిల్ మాట్లాడుతూ, విభిన్న కాంబినేషన్లతో టీమ్ని పరీక్షిస్తున్నామని చెప్పాడు. భారత్లో ఆడేటప్పుడు పిచ్, వాతావరణ పరిస్థితులను బట్టి కాంబినేషన్లలో మార్పులు అనివార్యంగా ఉంటాయని తెలిపారు. సెకండ్ బౌలింగ్ చేసే జట్టుకు పొగమంచు కొంత సవాలుగా మారవచ్చని అన్నాడు. కాబట్టి, ఎలాంటి కాంబినేషన్ ఉంటే బావుంటుందనే దానిని బట్టి జట్టుని ఎంపిక చేశామని తెలిపాడు. పిచ్ బావుందని, సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కాస్త తేలిక అవుతుందని భావిస్తున్నట్టు గిల్ అన్నాడు. అందుకే బౌలింగ్ ఎంచుకున్నట్టు వివరించారు. కాగా, విజయ్ హజారే ట్రోఫీ రూపంలో ఆటగాళ్లు అందరూ మ్యాచ్లు ఆడి నేరుగా ఈ సిరీస్లో పాల్గొంటున్నారని, కాబట్టి, అందరూ ఫామ్లోనే ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుత టీమ్లోని ఆటగాళ్లమంతా కలిసి చాలా మ్యాచ్లు ఆడామని, కాబట్టి, టీమ్లో వాతావరణం చాలా చక్కగా, ప్రశాంతంగా ఉందని చెప్పాడు.
ఆరుగురు బౌలర్లతో బరిలోకి
ఈ మ్యాచ్లో ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగుతున్నట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, హర్షిత్ రాణా పేసర్లుగా తీసుకున్నట్టు తెలిపాడు. మరోవైపు, న్యూజిలాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోంది. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టుకు కీలక ప్లేయర్లు ఉన్నారు.

