Telangana Congress: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి కాంగ్రెస్ పార్టీ కీలక అస్త్రాలను ఉపయోగిస్తున్నది. ఈ నియోజకవర్గంలో పీజేఆర్, ఎన్టీఆర్ అభిమానుల ప్రభావంతో పాటు మైనార్టీ ఓటర్ల సంఖ్య కూడా అధికంగా ఉన్నది. దీంతో ఈ మూడు ఫ్యాక్టర్స్ను కాంగ్రెస్కు అనుకూలంగా మారేలా సర్కార్ మలుచుకున్నది. దీనిలో భాగంగానే బోరబండలో పీజేఆర్ విగ్రహంతో పాటు ఆయన పేరు కూడా పెడతామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో పాటు గత ప్రభుత్వం పీజేఆర్ను విస్మరించిన తీరును వివరించారు.
Also Read: Telangana Congress: ఆ ముగ్గురు మినిస్టర్ల మధ్య దుమారం.. రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్
ఇక అమీర్ పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు
పీ జనార్థన్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని దింపిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తు చేశారు. పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో అప్పటి ప్రధాన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయని, ఆయన కుటుంబంపై ప్రజల్లో వెల్లువెత్తిన సానుభూతిని కనీసం లెక్క చేయకుండా కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ చేయించారనే అంశాన్ని సీఎం లేవనెత్తారు. దీని ద్వారా బీఆర్ఎస్ ఇప్పుడు లేవనెత్తిన సెంటిమెంట్ నినాదాన్ని హస్తం నిలువరించినట్లైంది. ఇక అమీర్ పేట్లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. కమ్మ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో పాటు మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మూడు నిర్ణయాలు తమకు పాజిటివ్గా మారుతాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతున్నది.
మూడు ఫ్యాక్టర్స్లోనూ భారీగానే ఓటు బ్యాంక్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు పీజేఆర్ కుటుంబం కీలక శక్తిగా ఉన్నది. మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ దివంగత నేత పీజేఆర్ ఈ నియోజకవర్గంలో బలమైన ఫాలోయింగ్ను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తనయుడికి కూడా గతంలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం లభించింది. ఇప్పటికే జూబ్లీహిల్స్లోని బొరబండ, యూసఫ్గూడ, రెహ్మత్ నగర్, ఎర్రగడ్డ వంటి ప్రాంతాలతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనూ పీజేఆర్ ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పీజేఆర్ ప్రభావంతో సుమారు 50 వేల ఓటర్లు ప్రభావితం అవుతారని సర్కార్ అంచనా. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో పీజేఆర్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి కాంగ్రెస్ కృషి చేస్తున్నది.
కమ్మ ఓటర్లు 40 వేల మంది
ఇక మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు కూడా ఇప్పటికీ జూబ్లీహిల్స్లో అభిమానులు ఉన్నారు. కమ్మ ఓటర్లు 40 వేల మంది ఉండగా, వీరంతా ఈ నియోజకవర్గంలోని 3 లక్షల ఓటర్లను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ ఇద్దరి నేతల చరిష్మాను కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడంలో సక్సెస్ అయింది. ఇక అత్యధిక ఓటర్లను కలిగిన మైనార్టీ వర్గాల ఓట్లు దాదాపు లక్షన్నర ఉన్నాయి. వాళ్లందరి ఓటు బ్యాంక్ను సొంతం చేసుకునేందుకు మంత్రిగా అజారుద్దీన్కు ఛాన్స్ ఇచ్చారు. పైగా ఆయన గతంలో ఇదే నియోజకవర్గంలో పోటీ చేసి దాదాపు 50 వేల ఓట్లను సొంతం చేసుకోగలిగారు. దీంతో ఈ మూడు ఫ్యాక్టర్లు ప్రస్తుత అభ్యర్ధి నవీన్ యాదవ్కు ప్లస్ అవుతాయనే అభిప్రాయంలో కాంగ్రెస్ ఉన్నది.
కులాలు, ఇతర సంఘాలకు భరోసా
మైనార్టీ, క్రిస్టియన్, బీసీ కుల సంఘాలతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన సంఘాలు, కార్మిక సంఘాలకు సీఎం హామీల వర్షం కురిపించారు. ఆయా సంఘాలకు ఏళ్ల తరబడి నుంచి పెండింగ్లోని సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూనే, సంక్షేమం, అభివృద్ధికి తానే బాధ్యత తీసుకుంటానని భరోసా కల్పిస్తున్నారు. సమాధుల స్థల వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు డివిజన్ల వారీగా అభివృద్ధికి నిధులు వంటివి భరోసా కల్పిస్తున్నారు. దీంతో ఆయా సంఘాలన్నీ బహిరంగంగానే మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సునాయసంగా విజయం సాధిస్తుందని పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.
ప్రతిపక్షాలపై ఎదురుదాడి
సీఎం రేవంత్ రెడ్డి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ముఖ్యమంత్రి రోడ్ షోలు, బహిరంగ సభలు కాంగ్రెస్ అభ్యర్థికి ఊతమిస్తున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం గట్టి కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అంతేగాక గత ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై నేరుగా విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతున్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం వలన ఉపయోగాలను వివరిస్తున్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను కంటోన్మెంట్తో ముడిపెట్టి ప్రజలకు వివరిస్తున్నారు. గతంలో ఆ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించడం వల్ల అక్కడ రూ.4 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు.
మెరుగైన నీటి వసతి, ఎలివేటెడ్ కారిడార్లు, మౌలిక సదుపాయాలు ఇలా అన్నింటిపై ప్రజలు చర్చించుకునేలా చేస్తున్నారు. జూబ్లీహిల్స్ బస్తీల రూపురేఖలు మారుస్తామని ప్రజలను కన్విన్స్ చేస్తున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్లో జరుగుతున్న రూ.200 కోట్ల అభివృద్ధి పనులు కేవలం ట్రైలర్ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. దీంతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య పొత్తు నడుస్తున్నదని, వీరిది ఫెవికాల్ బంధమని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో హస్తం నేతలు సక్సెస్ అయ్యారు. ఇవన్నీ తమకు కలిసి వచ్చే అంశాలుగా పార్టీ లీడర్లు చెబుతున్నారు.
