Attack on Delhi CM: దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Chief Minister Rekha Gupta)పై ఇవాళ ఉదయం దాడి జరిగింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చినట్లు బీజేపీ వర్గాలు (BJP leaders) తెలిపాయి. ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజావేదిక’ (Jansunwai) సమయంలో దాడి ఘటన చోటుచేసుకుంది. 30 ఏళ్లు ఉండే ఓ వ్యక్తి ఫిర్యాదుదారుడిగా వచ్చి ఆకస్మికంగా ఆమెపై దాడి చేశాడు. అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది.. వెంటనే అతడ్ని నియంత్రించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు సీఎం నివాసానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
ప్రతీ వారం ప్రజల సమస్యలు వినడానికి సీఎం రేఖా గుప్తా తన నివాసంలో ‘జనసున్వాయి’ (ప్రజా వేదిక) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా.. దాడి ఘటన చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత హరీశ్ ఖురానా (Harish Khurana) దాడిపై స్పందిస్తూ ‘ఒక వ్యక్తి ముఖ్యమంత్రిపై దాడి చేశాడు. ప్రస్తుతం వైద్యులు ఆమెను పరీక్షిస్తున్నారు. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజకీయ ప్రేరేపిత దాడేనా అన్నది దర్యాప్తు జరగాలి’ అన్నారు. నిందితుడు మహిళా సీఎం చెంపపై కొట్టడంతో పాటు ఆమె జుట్టు పట్టుకున్నట్లు హరీశ్ ఖురానా తెలిపారు.
Also Read: Hyderabad Tragedy: బండ్లగూడలో మరో విషాదం.. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్
సాక్షులు ఏమన్నారంటే?
సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. దాడిచేసిన వ్యక్తి కొన్ని పత్రాలతో సీఎం దగ్గరికి వచ్చాడు. ముఖ్యమంత్రితో మాట్లాడుతున్న క్రమంలో ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఘటనపై దిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా (Manjinder Singh Sirsa) మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి చేస్తున్న ప్రజాసేవను ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది’ అని అన్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇక గాల్లో తేలిపోండి.. రి రిలీజ్ కి రెడీ అవుతున్న ఆ హిట్ సినిమా?
దిల్లీ మాజీ సీఎం స్పందన
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) నేత అతిషి (Atishi).. సీఎంపై జరిగిన దాడిపై స్పందించారు. ‘దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలకు, నిరసనలకు స్థానం ఉంది. కానీ హింసకు ఎలాంటి స్థానం లేదు. ఈ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. మరోవైపు దిల్లీ పోలీసులు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారు. భద్రతా లోపం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. దాడి ఘటనను దిల్లీ పోలీస్ కమీషనర్ ఎస్బీకే సింగ్ (SBK Singh) స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.