CM Revanth Reddy: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న జల వివాదాల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు. గోదావరి, కృష్ణా వాటి ఉప నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మాణ ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల్లోని వివిధ అంశాల పరిశీలనకు ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, జల్శక్తి అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
జల్శక్తి కార్యాలయంలో మంత్రి సీఆర్ పాటిల్ (CR Patil) అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రులు, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. జల్శక్తి, ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల కమిటీ గోదావరి, కృష్ణా నదుల నీటి కేటాయింపులు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నసమస్యలను కమిటీ పరిశీలించి చర్చిస్తుందని సీఎం వెల్లడించారు. ఆ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై పైస్థాయిలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Also Read: CM Revanth Reddy: పదేళ్లలో కేసీఆర్ ఇచ్చిన రేషన్ కార్డులెన్ని? సీఎం సంచలన వ్యాఖ్యలు..
వాటిపై చర్చించాం..
కృష్ణా నది జలాల్లో ఏ రాష్ట్రం ఎంతమేర నియోగించుకుంటున్నదనే విషయంపై టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించగా దానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందన్నారు. ఈ రకంగా ఒక సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రతకు సంబంధించి జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ), ఇతర సంస్థలు తెలిపిన వివరాలపై చర్చించి మరమ్మతుల విషయాన్ని ప్రస్తావించగా ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తర్వాతి కాలంలో జరిగిన అపెక్స్ కమిటీలో గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కోటి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారని, గోదావరి నది యాజమాన్య బోర్డును తెలంగాణలో, కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వివరించారు.
బనకచర్ల అంశమే చర్చకు రాలేదు
బనకచర్లకు సంబంధించి తాము చేసిన ఫిర్యాదులపై కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సంస్థలు స్పందించి అభ్యంతరాలు చెప్పినందున ఆ అంశమే ప్రస్తావనకు రాలేదని ఓ ప్రశ్నకు ముఖ్యమంత్రి బదులిచ్చారు. కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కు ధారాదాత్తం చేసి అన్యాయం చేశారని, వాటిని పరిష్కరించడానికి విధివిధానాలను ముందుకు తీసుకువచ్చామని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. టెలీమెట్రీ యంత్రాల ఏర్పాటు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అంగీకరించడం తెలంగాణ విజయమని రేవంత్ రెడ్డి తెలిపారు.
చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని చెప్పారు. ఇది చెడిపోతే బాగుండునని కొంతమందికి ఉందని, ఇరు రాష్ట్రాలు కొట్టుకుంటే తమకు బాగుంటుందని వాళ్లు అనుకుంటున్నారని వారిని చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేమని వ్యాఖ్యానించారు. పదేళ్లు అవకాశం ఇచ్చినా వాళ్లు (బీఆర్ఎస్ను ఉద్దేశించి) ఏ సమస్య పరిష్కరించలేకపోయారని, వాళ్ల దుఃఖాన్ని, బాధను తాము అర్ధం చేసుకుంటామని చమత్కరించారు.
వాళ్లకు సమాధానం ఇవ్వడానికి తాము లేమని, తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా తామున్నామని పరిపాలన ఎలా చేయాలో తమకు తెలుసని సీఎం తెలిపారు. వివాదాలు చెలరేగకుండా సమస్యలను శాశ్వత పరిష్కారం చూపడం తమ బాధ్యతని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, (Uttam Kumar Reddy) ఎంపీలు డాక్టర్ మల్లు రవి, అభిషేక్ మను సింఘ్వీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, (Chamala Kiran Kumar Reddy) కుందూరు రఘువీర్ రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, డాక్టర్ కడియం కావ్య, సురేష్ షెట్కార్, గడ్డం వంశీకృష్ణ, పోరిక బలరాం నాయక్ పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: గులాబీ బాస్కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్!