US shutdown: అగ్రరాజ్యం అమెరికా ఫెడరల్ ప్రభుత్వం 2019 తర్వాత తొలిసారి షట్డౌన్ (US shutdown) స్థితిలోకి జారుకుంది. బుధవారం గడువు సమయంలోగా ఫండింగ్ బిల్లు ఆమోదానికి చట్టసభ్యులు అంగీకరించకపోవడంతో షట్డౌన్ అనివార్యమైంది. రిపబ్లికన్లు ప్రతిపాదించిన తాత్కాలిక ఫండింగ్ బిల్లును సెనేట్లో డెమొక్రాట్ సభ్యులు తిరస్కరించారు. హెల్త్కేర్ ప్రొటెక్షన్, వ్యయాల ప్రాధాన్యతలపై విభేదిస్తూ బిల్లు ఆమోదానికి అంగీకరించలేదు. దీంతో, అర్ధరాత్రి నుంచి షట్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో, అత్యవసర సేవలు మినహా మిగతా ప్రభుత్వ విభాగాల కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అనేక సేవలు తాత్కాలికంగా ఆగిపోయాయి. లక్షలాది మంది ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా అందలేదు. ఈ పరిస్థితి కొన్ని వారాలపాటు కొనసాగే అవకాశం ఉంది. మరి, విమానయాన, రైల్వే రంగ సేవలు కూడా ఆగిపోతాయా?, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిందేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
విమాన సేవలు యథాతథం
ఫెడరల్ ఫ్రభుత్వం షట్డౌన్లో ఉన్నప్పటికీ విమానయాన రంగ సేవలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, బోర్డింగ్ సెక్యూరిటీ, విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేసే ఉద్యోగులు జీతాలు అందకపోయినా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సేవల్లో అవసరం లేని ఉద్యోగులను మాత్రమే సెలవుపై పంపుతారు. కాబట్టి, చిన్నచిన్న అవాంతరాలు మినహా విమానయాన రంగ సేవలపై పెద్దగా ప్రభావం ఉండదు. సర్వీసులు అంబాటులోనే ఉంటాయి. కాగా, 2018–19లో 35 రోజుల పాటు అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ అయింది. ఆ సమయంలో సరిగా అవగాహనలేకపోవడంతో కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. వేతనాల అందక ఉద్యోగులు కొన్ని సేవలు నిలిపివేశారు. దీంతో, పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. కానీ, క్రమంగా పరిస్థితులు సర్దుకున్నాయి.
Read Also- CM Chandrababu: ఫ్రీ బస్సు పథకంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
ట్రావెల్ డాక్యుమెంట్లపై నో ఎఫెక్ట్
స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం, షట్డౌన్ కాలంలో పాస్పోర్టులు, వీసాలు, విదేశాల్లోని కాన్సులర్ సేవలు యథావిథిగా కొనసాగుతాయి. ఎంబసీలు, కాన్సులేట్లు సాధారణ రోజుల మాదిరిగానే పనిచేస్తాయి. ఈ సేవలు వార్షిక బడ్జెట్పై ఆధారపడవు, అందుకే షట్డౌన్కి ప్రభావితం కాబోవు. పర్యాటకులు, బిజినెస్ పనిమీద వెళ్లే ప్రయాణికులు వీసాలు, పాస్పోర్ట్ల కోసం ఎప్పటిమాదిరిగానే దరఖాస్తు చేసుకోవచ్చు.
విమానయాన రంగంపై ప్రభావం
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్కి గురైనప్పటికీ, విమాన సర్వీసులు ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి. అయితే, రాబోయే రోజుల్లో ఈ రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. 13,000 మందికి పైగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు శాలరీ లేకుండానే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 3,500 మంది విమానయాన సహాయక సిబ్బందిని సెలవుపై పంపారు. ఈ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసుల ఆలస్యం, విమానాల రద్దుకు దారి తీయవచ్చని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది. 2019 షట్డౌన్ సమయంలో, వేతనం లేకుండా పని చేసిన ఉద్యోగుల్లో చాలామంది ఆరోగ్యం బాగాలేదంటూ సెలవులు పెట్టేశారు. దీంతో, చాలా సేవలు ప్రభావితం అయ్యాయి. ముఖ్యంగా, న్యూయార్క్లోని లాగ్వార్డియా ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, అట్లాంటాలోనూ ఈ ప్రభావం కనిపించింది.
Read Also- US Shutdown: షట్ డౌన్లోకి అమెరికా.. ఆగిపోయిన ప్రభుత్వ సేవలు.. 6 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైమ్
రైలు సేవలపై నో ఎఫెక్ట్
విమాన సర్వీసుల మాదిరిగానే దేశవ్యాప్తంగా ట్రైన్ సర్వీసులు కూడా కొనసాగుతాయి. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నార్త్ఈస్ట్ కారిడార్ పాటు, అన్ని ప్రాంతాలు సేవలు కొనసాగుతాయని ‘అమ్ట్రాక్’ అనే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ప్రకటించింది. అయితే, అమెరికాలో అనేక నేషనల్ పార్కులు మూతపడే అవకాశం ఉంది. గత షట్డౌన్ల సమయంలో కూడా అమెరికాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు మూతమపడ్డాయి. అనేకమంది టూరిస్టుల షెడ్యూల్స్ దెబ్బతిన్నాయి.