Kim Jong Un – Missile: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అంతర్జాతీయంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న మరోసారి దూకుడు చర్యకు పాల్పడ్డారు. ఆదివారం నాడు ఒక బాలిస్టిక్ మిసైల్స్ను తూర్పు సముద్రంలోకి (East Sea) ప్రయోగించారు. ఉత్తరకొరియా రాజధాని నగరం ప్యాంగ్యాంగ్ నుంచి ప్రయోగించిన ఈ మిసైళ్లు వెళ్లి కొరియా ద్వీపకల్పం, జపాన్ మధ్య సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ క్షిపణి దాదాపు 900 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాయని దక్షిణకొరియా తెలిపింది. రెండు క్షిపణులు ప్రయోగించగా ఒకటి 900 కిలోమీటర్లు, మరొకటి 950 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయని జపాన్ పేర్కొంది. ఉత్తరకొరియాకు ప్రత్యర్థి దేశమైన దక్షిణకొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్.. చైనా పర్యటన మొదలైన రోజునే కిమ్ జాంగ్ ఉన్ ఈ చర్యకు పాల్పడ్డారు. మరోవైపు, వెనిజులా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను అమెరికా అరెస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
కాగా, ఉత్తరకొరియా మిత్రదేశమైన చైనాలో దక్షిణకొరియా అధినేత పర్యటన మొదలైంది. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడమే తన పర్యటన అజెండా అని లీ జే మ్యుంగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ను కూడా ఆయన కలవబోతున్నారు. అయితే, దక్షిణకొరియాతో చైనా స్నేహం చేయడం తాము సహించబోమనే అభిప్రాయాన్ని కిమ్ జాంగ్ ఉన్ బహిరంగంగా ప్రకటించినట్టు అయ్యిందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also- Crime News: ముఖ్తల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరో వాహణం బైక్ ఢీకొని స్పాట్లో యువకుడు మృతి
ఖండించిన దక్షిణకొరియా, జపాన్
ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగంపై దక్షిణ కొరియా, జపాన్ ఉలిక్కిపడ్డాయి. ఈ ప్రయోగాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దక్షిణ కొరియా అయితే అత్యవసర భద్రతా సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ చేస్తున్న ఈ తరహా రెచ్చగొట్టే చర్యలను ఆపివేయాలని ఉత్తర కొరియాను కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, నేరుగా జపాన్ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి స్పందించారు. ఉత్తరకొరియా ప్రయోగాలు పొరుగు దేశాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమాజ శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాకు జపాన్ ప్రభుత్వం తీవ్ర నిరసన తెలియజేస్తోందని, తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, కిమ్ ఉన్ శనివారం నాడు ఒక ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. టాక్టికల్ గైడెడ్ వెపన్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు కంటే ఎక్కువ చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి.
మేము వెనిజులా లెక్క కాదు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ నేపథ్యంలో, ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. తాము వెనిజులా మాదిరిగా కాదనే సంకేతాలను కిమ్ జాంగ్ ఉన్ ఇచ్చినట్టు అయ్యిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమ దేశానికి అణు, సైనిక శక్తి ఉన్నాయని, దురాక్రమణ ప్రయత్నాలను తిప్పికొట్టగలమని, అందుకు సర్వధాసిద్ధంగా ఉన్నట్టుగా కిమ్ సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా వెనిజులాకు దక్షిణకొరియాకు చాలా వ్యత్యాసం ఉందనే సందేశాన్ని పంపించాలనే ఉద్దేశంతో కిమ్ క్షిపణి ప్రయోగం చేపట్టి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

