Bomb Threat: జర్మనీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ (Lufthansa Airlines) విమానానికి బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపింది. బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ రకానికి చెందిన ఎల్హెచ్ 752 విమానం (Flight LH752) జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టు (Frankfurt Airport) నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Hyderabad Rajiv Gandhi International Airport) ఫ్లైట్ రావాల్సి ఉంది. అయితే విమానం బయలుదేరిన రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్.. విమానాన్ని యూటర్న్ తీసుకొని బయలుదేరిన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టులోనే ల్యాండ్ చేశారు.
హైదరాబాద్లో ల్యాండింగ్కు నిరాకరణ
విమానానికి బాంబు బెదిరింపు ఘటనపై లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ అధికారులు స్పందించారు. హైదరాబాద్ లో ఎల్హెచ్ 752 విమానం (Flight LH752) ల్యాండ్ చేసేందుకు తమకు అనుమతి రాలేదని పేర్కొన్నారు. ఈ కారణం చేతనే విమానాన్ని వెనక్కి రప్పించినట్లు స్పష్టం చేశారు. మరోవైపు రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ అధికారులు సైతం దీనిపై మాట్లాడారు. విమానానికి బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. అయితే ఆ సమయంలో భారత ఎయిర్ స్పేస్ కు విమానం చాలా దూరంలో ఉందని అన్నారు. ఈ కారణం చేతనే జర్మనీ ఫ్లైట్ తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చిందని ఎయిర్ పోర్ట్ అధికారి ఒకరు వివరించారు. అయితే విమానం ల్యాండ్ తర్వాత బాంబు బెదిరింపునకు సంబంధించి లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
చెన్నైకి వచ్చే ఫ్లైట్ సైతం
మరోవైపు లండన్ నుంచి చెన్నై రావాల్సిన బ్రిటిష్ఎయిర్ వేస్ (British Airways) కు చెందిన బోయింగ్ విమానం సైతం బయలు దేరిన కొద్దిసేపటికీ యూటర్న్ తీసుకుంది. టేకాఫ్ అయిన లండన్ లోని హిత్రో ఎయిర్ పోర్ట్ లోనే తిరిగి అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పైలెట్ గుర్తించారు. దీంతో వెంటనే హిత్రో ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ల్యాండింగ్ కు క్లియరెన్స్ రావడంతో బోయింగ్ విమానం తిరిగి సేఫ్ గా లండన్ లో ల్యాండ్ అయ్యింది. విమానంలో తలెత్తిన సమస్యను పరిష్కరించి తిరిగి ఫ్లైట్ ను పంపేందుకు తమ టీమ్ కృషి చేస్తున్నట్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ వెల్లడించింది.
Also Read: Israeli Iran War: తీవ్ర విషాదం.. దాడుల్లో 244 మంది మృత్యువాత.. ఇంత దారుణమా!
ఎయిర్ఇండియా విమానానికి బెదిరింపు
ఇటీవల థాయిలాండ్ (Thailand) నుంచి ఢిల్లీ (Delhi)కి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి (Air India Flight) సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. థాయిలాండ్ లోని పుకెట్ (Phuket) విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలు దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు ఈ హెచ్చరిక వెళ్లింది. దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని తిరిగి పుకెట్ విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 379 (Flight AI 379) అండమాన్ సముద్రంపై ప్రయాణిస్తుండగా ఈ బాంబు బెదిరింపులు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారుల సూచన మేరకు ఫ్లైట్ ను బయలుదేరిన విమానశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.