Indian-Origin Dies: ఆస్ట్రేలియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్న భారత సంతతి వ్యక్తి గౌరవ్ కుండి (42) ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు అరెస్ట్ కు యత్నించిన సమయంలో ఆయన మెదడుకు బలమైన గాయం కావడమే మృతికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై వెంటనే రంగంలోకి దిగిన సౌత్ ఆస్ట్రేలియా పోలీసు కమిషనర్ (South Australian Police Commissioner) విచారణకు ఆదేశించారు. కాగా, మృతుడు గౌరవ్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండటంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే?
భారత్ కు చెందిన గౌరవ్ కుండి (Gaurav Kundi), అమృతపాల్ కౌర్ భార్య భర్తలు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ (Adelaide)లో ఇద్దరు పిల్లలతో కలిసి వారు జీవిస్తున్నారు. ఈ క్రమంలో గత నెల మే 30 రాత్రి రాయ్ స్టన్ పార్క్ (Royston Park) ప్రాంతంలో నడిరోడ్డుపై వారిద్దరు గొడవ పడ్డారు. ఆ సమయంలో గౌరవ్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. వారి వాగ్వాదాన్ని గమనించిన అటుగా వెళ్లే ఓ వ్యక్తి.. వెంటనే పోలీసులు ఫోన్ చేశాడు. దీంతో సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
నేలపై బలవంతంగా పడేసి..
అయితే తమ మధ్య ఎలాంటి గొడవ జరగలేదని భార్య అమృతపాల్ పోలీసులకు తెలిపింది. ఒక చిన్న వాగ్వాదమేనని పోలీసులను వారించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె మాటలను పోలీసులు వినిపించుకోలేదు. గృహ హింసగా భావించి.. గౌరవ్ కుండిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అతడ్ని బలవంతంగా నేలపై పడేశారు. కింద పడిపోయిన గౌరవ్ తలపై పెట్రోలింగ్ అధికారి (Petroling Officer) తన మోకాలితో గట్టిగా అదిమాడని భార్య అమృత్ పాల్ తెలిపింది. తల నేలకు, పోలీసు వాహనానికి బలంగా తాకడంతో గౌరవ్ అక్కడే స్పృహ కోల్పోయాడని తెలిపింది.
మెదడు, మెడ నరాలకు తీవ్ర గాయం
ఆస్పత్రికి తరలించిన అనంతరం.. గౌరవ్ కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో రెండు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న గౌరవ్.. తాజాగా మరణించినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. దీంతో గౌరవ్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న గొడవే అని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని, భార్య అమృతపాల్ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు వ్యవహరించిన తీరును కళ్లకు కట్టే వీడియోను రిలీజ్ చేసి.. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Air India plane Crash: అంతులేని విషాదం.. 92 బాడీలు గుర్తింపు.. ఫ్యామిలీలకు అందజేత!
అత్యున్నత స్థాయి విచారణ
ఈ ఘటన అటు ఆస్ట్రేలియాతో పాటు ఇటు భారత్ లోనూ తీవ్ర సంచలనం రేపింది. ఆస్ట్రేలియా పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. సౌత్ ఆస్ట్రేలియా పోలీస్ కమిషనర్ గ్రాంట్ స్టీవెన్స్ (Grant Stevens) ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. మేజర్ క్రైమ్ & అంతర్గత విచారణ విభాగం డిటెక్టివ్లు జరిపే దర్యాప్తునకు అదనంగా కమిషనర్ స్థాయి విచారణ ఉంటుందని స్టీవెన్స్ తెలిపారు. మరోవైపు ఘటనపై విచారణ జరుపుతున్న ఓ పోలీసు అధికారి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పెట్రోలింగ్ ఆఫీసర్లు బాడీ కెమెరాను పరిశీలించారు. అయితే అందులో మోకాలితో తలను నొక్కలేదని తేలిందని చెప్పారు. అయినప్పటికీ మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.