New Moon: అంతరిక్షంలో భూమికి దగ్గరగా మరో బుల్లి చంద్రుడు వచ్చి చేరాడు. చిన్న పరిమాణంలో భూమి చుట్టూ సంచరిస్తున్న ఈ గ్రహశకలాన్ని క్వాసీ మూన్ (quasi – moon) లేదా క్వాసీ ఉపగ్రహం (quasi-satellite)గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మీట్ అర్జున 2025 PN7’ అనే కొత్త అధ్యయనం ప్రకారం ఈ అంతరిక్ష శిల.. 1960 నుండి భూమి కక్ష్యకు సమీపంలో పరిభ్రమిస్తోంది. 2080 వరకూ ఇది అలాగే కొనసాగనున్నట్లు ఖగోళ నిపుణులు అంచనా వేశారు.
అర్జున వర్గానికి చెందిన..
2025లో కనుగొనబడిన ఈ PN7 గ్రహశకలాన్ని.. అర్జున వర్గానికి (Arjuna class) చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా అర్జున వర్గానికి చెందిన గ్రహశకలాలు.. భూ కక్ష్యకు దగ్గరగా సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి. ఇవి ఇతర ఉపగ్రహాల్లాగా భూ గురుత్వాకర్షణకు ప్రభావితం కావు. కానీ వలయాకార మార్గాల్లో తిరుగుతున్నందున ఇవి భూమి చుట్టూ తిరుగుతున్నట్లుగా మనకు భ్రమను కలిగిస్తాయి.
భూమి తరహాలోనే సూర్యుడి చుట్టూ..
శాస్త్రవేత్తల ప్రకారం.. PN7 వంటి క్వాసీ మూన్స్ భూమి తరహాలోనే ఒక ఏడాది వ్యవధిలో సూర్యుడ్ని చుట్టేస్తుంది. అయితే వాటి కక్ష్య మార్గం సూర్యుడి చుట్టూ తిరిగే ఇతర గ్రహశకలాలతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉండడం వల్ల అవి కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాయి. కొన్నిసార్లు దూరమవుతాయి. ‘క్వాసీ మూన్స్ ఇద్దరు నర్తకుల లాంటివి. అడుగులు కదుపుతారు కానీ చేతులు పట్టుకోరు’ అని పరిశోధకులు పేర్కొన్నారు.
1991లో తొలిసారి గుర్తింపు
అంతరిక్షంలో క్వాసీ మూన్ ను తొలిసారి 1991లో గుర్తించారు. 1991 VG అనే గ్రహశకాలన్ని తొలి క్వాసీ మూన్ గా ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది భూమికి సమానమైన కక్ష్యలో ఉన్న మెుట్టమెుదటి గ్రహశకలం. అప్పట్లో ఇది భూమికి దగ్గరగా వచ్చినప్పుడు ‘ఏలియన్ వాహనం అయి ఉండొచ్చా?’ అనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ దశాబ్దాల పరిశోధన తర్వాత.. ఇవి సహజమైన ఖగోళ వస్తువులేనని నిర్ధారణ అయ్యింది.
Also Read: Kavitha on New Party: ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా.. ఇది పెద్ద విషయమే కాదు.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
గతంలో గుర్తించిన క్వాసీ మూన్స్
అయితే గతంలోనూ కొన్ని క్వాసీ మూన్స్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి పేర్లు సైతం పెట్టారు. కమోఓలేవా (2016 HO3), కార్డియా (2004 GU9), 2023 FW13 వంటి క్వాసీ మూన్స్ ను గతంలో గుర్తించారు. తాజాగా వీటి సరసన 2025 PN7 వచ్చి చేరింది. ఈ క్వాసీ మూన్స్ ఆధారంగా విశాలమైన సౌర కుటుంబంలోని గ్రహశకలాల కదలికలను అధ్యయనం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
