ఈ ప్రపంచంలో శ్రమైక జీవన సౌందర్యానికి సరితూగగలినది మరొకటి లేదు. సమాజ గతిని, పురోగతిని శాసించేది, నిర్దేశించేది శ్రామిక వర్గమే. మరి.. ఆ శ్రమ..దోపిడీకి గురైతే, అభాగ్యులైన శ్రామికలోకం పీడనకు లోనైతే ఏం జరుగుతుంది..? శ్రమించే చేతులే పిడికిళ్లై నిలబడతాయి. భూమినీ ఆకాశాన్నీ ఒకటి చేస్తాయి. సమాజాన్ని కదలించే ఉద్యమాలనూ తీసుకొస్తాయి. సరిగ్గా 1886 మే 1వ తేదీన ఇదే జరిగింది. అప్పట్లో 12 నుంచి 15 గంటలుగా ఉన్న పని సమయాన్ని 8 గంటలకు తగ్గించాలనే డిమాండ్తో 2 లక్షలమంది కార్మికులు చికాగో నగరంలోని హే మార్కెట్ వద్ద శాంతియుతంగా నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు అక్కడి నుంచి కదిలబోమని తేల్చి చెప్పారు. తొలి రెండు రోజులు దీనిని మౌనంగా గమనించిన బూర్జువా ప్రభుత్వం మూడో రోజుకు సహనం కోల్పోయాయి. పోలీసులను దించి కాల్పులకు ఆదేశాలిచ్చింది. దీంతో మే 3వ తేదీ చికాగో నగరంలోని ఆ చౌరస్తా.. తుపాకీ మోతలతో, బుల్లెట్టు చప్పుళ్లతో రణరంగంగా మారింది. ఈ కాల్పుల్లో ఇద్దరు కార్మికులు పెట్టుబడీ పెత్తందార్ల తూటాలకు అమరులయ్యారు.
ఈ వార్త యావత్ కార్మిక లోకాన్ని కదలించి, నిరసన కొనసాగేలా చేసింది. దీంతో మే 4న మళ్లీ పోలీసు తుపాకులు గర్జించగా, ఆ తూటాల వర్షంలో ఎనిమిదిమంది బలయ్యారు. శ్రామికలోకపు న్యాయమైన హక్కుల కోసం అసువులు బాసి, అమరులైన ఆ అమల వీరుల త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తుంచుకునేందుకు 1889లో సోషలిస్టు పార్టీలన్నీ ఏటా మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరపాలని, నాడు నెత్తురుతో తడిసిన చికాగో హే మార్కెట్లో అమరవీరుల స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాయి. అదే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మారింది. నాడు చికాగో కార్మిక వీరుల అమరత్వం.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులను ప్రశ్నించే దిశగా అడుగులు వేయించింది. హే మార్కెట్లో నాడు ఎగిరిన జెండా.. ప్రపంచ కార్మికులకు విజయ పతాకంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రభుత్వాలు కార్మికుల కోసం సంక్షేమ పథకాలు ప్రారంభించటం మొదలైంది. తమ హక్కుల కోసం కార్మికలోకం నిరసన తెలిపే ప్రత్యేక సందర్భంగానూ మేడే నిలిచింది.
Also Read: భయంలో బీజేపీ.. రాహుల్ ప్రధాని కావడం ఖాయం
మనదేశంలో మాత్రం కాస్త ఆలస్యంగానే మేడే కార్యక్రమం జరిగింది. మద్రాసు పట్టణంలో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్యర్యంలో తొలిసారి 1923 మే 1న కార్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమాలు జరిగాయి. మద్రాసులో లేబర్ కిసాన్ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి ఈ వేడుకలను జరుపుకున్నారు. నాటి ఆ కార్యక్రమానికి మలయపురం సింగారవేలు అన్నీ తానై వ్యవహరించారు. 1860లో మద్రాస్లోని సంపన్న మత్స్యకార (పరదవర్) కుటుంబంలో జన్మించిన ఈయన ఆధునిక భారతదేశ తొలి దళిత సిద్ధాంతకర్త, భాషావేత్త అయోతి దాస్, రష్యన్ విప్లవం, పెరియార్ ఆత్మగౌరవ ఉద్యమంతో ఉత్తేజితుడై స్వాతంత్ర్య పోరాటంతో బాటు అనేక కార్మికోద్యమాలను నడిపారు. ఒక పరిపూర్ణ ఉద్యమకారుడిగా, పలు రంగాల నిష్ణాతుడిగా ప్రజా జీవనంపై ఆయన తనదైన ముద్ర వేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, న్యాయవాది, వ్యాపారవేత్త, కార్మిక నేతగా పేరున్న సింగరవేలు.. నాటి తమిళ సామాజిక యవనికను స్ఫూర్తిదాయకంగా ప్రభావితం చేశారు.
సింగారవేలు కృషి కారణంగానే.. నాటి మద్రాసు ఫ్రావిన్స్లోని కర్మాగారాల్లో కార్మికులంతా కార్మిక సంఘాలుగా ఏర్పడి, తమ హక్కుల కోసం ఎలుగెత్తటం మొదలైంది. 1918, ఏప్రిల్ 27న మద్రాసులోని బకింగ్హామ్ కర్నాటిక్ టెక్స్టైల్ మిల్లు కార్మికులతో ‘మద్రాస్ లేబర్ యూనియన్’ పేరుతో తొలి ట్రేడ్ యూనియన్ను సింగారవేలు ప్రారంభించారు. కార్మికులకు ఎలాంటి హక్కులూ ఇవ్వబోమని మిల్లు యాజమాన్యం ప్రకటించటమే గాక, ఒక బ్రిటిష్ అధికారి మిల్లులోకి వచ్చి తుపాకీతో కార్మికులను బెదిరించారు. దీంతో కార్మికులు తిరగబడ్డారు. నాటి పోలీసు కాల్పుల్లో ఇద్దరు కార్మికులు నేలకొరిగారు. ఇది నివురుగప్పిన నిప్పులా కార్మిక లోకంలో ఉండిపోయింది. 1921, జూన్ 21న ఆ మిల్లు కార్మికులంతా మరోమారు నిరసనకు దిగగా, యాజమాన్యం కార్మికుల్లో కుల విభజనను తీసుకొచ్చి, ఆ పోరాటాన్ని నీరుగార్చింది. అయితే, ఈ కార్మిక చైతన్యమే అదే ఏడాది ఆగస్టు 29న పెరంబూరులోని మరో మిల్లులోనే ఉద్యమరూపంలో నిలబడటం, అక్కడా పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు కార్మికులు చనిపోవటం, ఆ మృతుల అంతిమయాత్ర మీదా పెట్టుబడి వర్గాలు ఉసిగొల్పిన కిరాయిమూకలు రాళ్లదాడి చేయటం, అంతిమంగా ఆ కార్మికపోరాటం కులాల మధ్య వచ్చిన ఘర్షణగా చిత్రీకరింపబడింది.
Also Read: అబద్ధాల కేసీఆర్.. పదేళ్లు చెప్పిన అబద్ధాలు చాలవా?
ఈ వైఫల్యం తర్వాత కార్మిక పోరాటాలకు రాజకీయ పార్టీల అండ అవసరమని సింగారవేలు గ్రహించారు. అప్పటికే ఆయన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే 1922, జనవరి 13న వేల్స్ యువరాజు తన భారత పర్యటనలో భాగంగా మద్రాస్ వచ్చాడు. 1919, ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ తాలూకూ జనంలో ఉన్న ఆక్రోశం ఈ యువరాజు పర్యటనలో బయటపడింది. పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు మద్రాస్ నగరంలో ఏర్పాటు చేసిన స్వాగత ఏర్పాట్లను ధ్వంసం చేయటమే గాక యువరాజును స్వాగతించిన జస్టిస్ పార్టీ నాయకుడు త్యాగరాయ చెట్టి ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కార్మికులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని సింగారవేలు నొక్కి చెప్పాడు. కానీ, కాలక్రమంలో ఆ పార్టీ వైఖరి నచ్చక 1923 మే 1 న ‘లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందూస్తాన్’ను స్థాపించి, ప్రప్రథమంగా ఎర్రజెండాను ఎగురవేశారు. ఆ రోజునే మద్రాస్ హైకోర్టు ఎదురుగా సముద్రతీరంలో, ట్రిప్లికేన్ బీచ్లో, నేపియర్ పార్కులో అరుణ పతాకాన్ని వందలాది ప్రజల సమక్షంలో ఎగురవేసి చరిత్ర సృష్టించారు.
1925లో కాన్పూర్లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభకు సింగారవేలు అధ్యక్షత వహించటమే గాక, మేడేను సెలవుదినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ శ్రేయస్సు కోసం అంకితభావంతో పోరాడిన సింగారవేలు తర్వాతి రోజుల్లో పెరియార్కు సన్నిహితుడై ఆత్మ గౌరవ ఉద్యమంలో పాల్గొన్నాడు. లేబర్ అండ్ కిసాన్ గెజెట్, తొజిలాలమ్ అనే పత్రికలను నడిపారు. శాస్త్ర విజ్ఞాన విషయాలపై రచనలు చేస్తూ, కార్మిక పోరాటాలకు మార్గదర్శిగా ఉంటూ 11 ఫిబ్రవరి 1946న కన్నుమూశారు. సింగారవేలు పోరాటాల కారణంగానే కార్మక దినోత్సవపు గొప్పతనం, దాని అవసరం ద్రవిడ ప్రాంతానికి అర్థమైంది. అదే అతి తక్కువ సమయంలో యావత్ భారతావనికి అర్థమైంది. నాటి నుంచి నేటి వరకు కార్మిక లోకానికి ఈ రోజు స్ఫూర్తినిస్తూనే ఉంది.
శ్రీకాంత్ చెర్వుగట్టు
జర్నలిస్ట్