Hyderabad Crime: హైదరాబాద్ మేడ్చల్ పరిధిలో ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. వారం వ్యవధిలో రెండు దాడి ఘటనలు జరగడం పరిస్థితులకు అద్దం పడుతోంది. తాజాగా మేడ్చల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేశారు. బస్సు ఆపి మరి భౌతిక దాడికి తెగబడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
శుక్రవారం ఉదయం మేడ్చల్ డిపో నుంచి బయల్దేరిన బస్సులో సీఎంఆర్ కాలేజీకి చెందిన విద్యార్థిని కూర్చొని ఉంది. బస్సు కొత్తపల్లి వద్దకు రాగానే ఒక సీనియర్ సిటిజన్ బస్సు ఎక్కారు. అయితే సీనియర్ సీటిజన్లకు కేటాయించిన సీటులో ఆమె కూర్చోవడంతో లేవమని సూచించాడు. అందుకు విద్యార్థిని ససేమీరా అనడంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరికి వృద్దుడే కాస్త సద్దుకొని వెనుక సీటులోకి వెళ్లి కూర్చున్నారు. అయితే పెద్దాయనతో విద్యార్థిని ప్రవర్తించిన తీరును బస్సులోని ప్రతీ ఒక్కరు తప్పుబట్టారు.
ఫోన్ చేసిన విద్యార్థిని..
తన గురించి పెద్దగా చర్చ జరగడంతో సదరు విద్యార్థిని అవమానంగా భావించింది. ఫోన్ చేసి ఇద్దరి వ్యక్తులకు సమాచారం ఇచ్చింది. దీంతో వారు మార్గం మద్యలో బస్సును అడ్డగించారు. గొడవ అంతటికీ కారణం డ్రైవర్, కండక్టర్ అని ఆరోపిస్తూ దుర్భాషలాడారు. కండక్టర్ అయ్యప్ప మాలలో ఉన్నారని చూడకుండా దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా అంతు చూస్తామని బెదిరించి వెళ్లిపోయారు. సీటు విషయంలో జరిగిన గొడవలో తమ ప్రమేయం లేకపోయినా దాడి జరగడంపై డ్రైవర్, కండక్టర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
Also Read: CM Revanth Reddy: కిషన్రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. సీఎం రేవంత్
పోలీసులకు ఫిర్యాదు..
తమపై దాడి చేసిన వ్యక్తులపై పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో కండక్టర్, డ్రైవర్ ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రెండు రోజుల క్రితం కూడా తిరుపతయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ పై పలువురు విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రజా సేవ చేస్తున్న సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఆర్టీసీ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. ఈ వరుస దాడులపై పోలీస్ అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులను శిక్షించి.. డ్రైవర్లు, కండక్టర్లకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
