Hyderabad Police: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కల్తీ ఆహార విక్రయాలపై ఇకపై పోలీస్, జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఆకస్మికంగా, ఫిర్యాదులు వస్తే స్పందించిన దాడులు, తనిఖీలు నిర్వహించే వారు. లోపాలున్న ఆహార విక్రయ కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించడంతో పాటు నోటీసులు జారీ చేసి, అవసరమైతే జరిమానాలు వసూలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు భిన్నంగా మారనున్నాయి. పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్లు కలిసి సమష్టిగా దాడులు నిర్వహించనున్నారు. కల్తీ ఆహారాన్ని, కాలం చెల్లిన సామాగ్రిని వినియోగిస్తూ ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు అధికారుల దాడులు, తనిఖీల్లో బయట పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీసు శాఖ, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
హత్యాయత్నంగా పరిగణించి కేసులు నమోదు
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే సహించేది లేదని, ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే కల్తీ ఆహార విక్రయాలను ఏకంగా హత్యాయత్నంగా పరిగణించి కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అల్టిమేటం జారీ చేశారు. అంతేగాక, ఈ సమావేశం తర్వాత పోలీస్, జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ వింగ్ అధికారులతో బృందాలను కూడా సిద్దం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుమారు 2 వేల కిలోమీటర్లకు విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధిని పరిగణలోకి తీసుకుని ఈ బృందాలను సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీపై తగినంత శ్రద్ధ చూపకపోవడం, ఫిర్యాదులు వస్తేనే దాడులు, తనిఖీలు నిర్వహించి, శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హబ్సిగూడలోని న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎన్ఐఎన్)కు పంపేవారు.
Also Read: Hyderabad Police: పోలీసులకు మిస్టరీగా ఎస్ఐ కేసు.. పిస్టల్ను పోగొట్టుకున్న భానుప్రకాశ్!
జైలు శిక్ష విధించే అవకాశం
శాంపిల్స్లో ప్రజారోగ్యానికి ముప్పు కలిగించనున్నట్లు పరీక్షల నివేదికలు వస్తే, అందుకు సదరు ఆహార విక్రయ కేంద్రం నిర్వాహకులను బాధ్యులను చేసి కేసులు నమోదు చేసేవారు. జైలు శిక్ష విధించే అవకాశమున్నా, జీహెచ్ఎంసీ చరిత్రలో ఇప్పటి వరకు ఒకరిద్దరికి మాత్రమే జైలు శిక్ష పడగా, మిగిలిన కేసులన్నింటికీ సంబంధించి జరిమానాలు విధించి, సదరు వ్యాపార సంస్థ యజమానికి నోటీసులు జారీ చేసి కల్తీ కాకుండా, క్వాలిటీ ఆహార విక్రయాన్ని విక్రయించేలా అఫిడవిట్ను స్వీకరించి, మళ్లీ విక్రయాలకు అనుమతించే వారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారనున్నట్లు సమాచారం. విక్రయిస్తున్న ఆహార పదార్థాలను తయారు చేసేందుకు కాలం చెల్లిన సామాగ్రిని వినియోగించినా, ఆకర్షణీయంగా కన్పించేందుకు కెమికల్ రంగులను వాడినా, అలాంటి నేరాన్ని ఏకంగా హత్యాయత్నంగా పరిగణించి కేసులు నమోదు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వరుసగా కల్తీ ఆహారాన్ని విక్రయిస్తూ ఫుడ్ సేఫ్టీ, పోలీసు, జీహెచ్ఎంసీ టీమ్లకు పట్టుబడిన నిర్వాహకులపై ఇలాంటి చర్యలు తీసుకోవాలని, ఒకటి , రెండు సార్లు పట్టుబడితే జరిమానాలు విధించడం, వ్యాపారానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్లను రద్దు చేయడం వంటివి చేపట్టాలని తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది.
Also Read: Hyderabad Police Dance: కమల్ హాసన్ సాంగ్కు.. దుమ్మురేపిన హైదరాబాద్ పోలీసులు.. ఓ లుక్కేయండి!

