Chiranjeevi: సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ విజన్ కార్యదక్షత నేటి తరానికి ఆదర్శనీయమని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ధృఢ సంకల్పానికి ఆయన నిలువెత్తు ప్రతీక అని చెప్పారు. సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో రాష్ట్రీయ ఏక్తాదివస్ రన్ ను నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినపుడు 560 ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి వన్ నేషన్ ను మనకు అందించిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ అని చెప్పారు. పోలీసులు ఇలాంటి కార్యక్రమాల ద్వారా యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్న సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం అభినందనీయమని వ్యాఖ్యానించారు.
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్కు ఫిర్యాదు!
డీప్ ఫేక్ అనేది గొడ్డలిపెట్టులాంటిదని చెప్పారు. కొంతమంది సైబర్ క్రిమినల్స్ దీని ద్వారా కొందరిని టార్గెట్ గా చేసుకుని అశ్లీల వీడియోలు తయారు చేసి వెబ్ సైట్లలో అప్ లోడ్ చేస్తున్నారన్నారు. ఈ సమస్యను డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ గా తీసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. పోలీసులు ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం పరుగు మాత్రమే కాదన్నారు. జాతీయ ఐక్యత కోసం అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమమని చెప్పారు. స్వాతంత్ర్యం సిద్ధించినపుడు దేశంలో 560కి పైగా సంస్థానాలు ఉండేవన్నారు. వాటన్నింటినీ విలీనం చేసి అఖండ భారతాన్ని అందించిన ఘటన సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ దని చెప్పారు.
సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ ను యువత ఆదర్శం
హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ ను యువత ఆదర్శంగా తీసుకుని మంచి సమాజాన్ని నిర్మించటానికి పాటు పడాలన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన పడవద్దని చెప్పారు. సైబర్ నేరాలతోపాటు డీప్ ఫేక్ వంటి అంశాలను సీరియస్ గా తీసుకుని సైబర్ నేరస్తులకు చెక్ పెట్టటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. చాలామంది అయిదు…పదివేలకు ఆశ పడి సైబర్ క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్స్ సమకూరుస్తున్నారన్నారు. దీని వల్ల చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల సైబర్ నేరస్తులకు ఎవ్వరూ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చ వద్దని తెలిపారు. కమిషనరేట్ లోని ఏడు జోన్లలో ఆయా జోన్ల డీసీపీ నేతృత్వంలో రాష్ట్రీయ ఏక్తాదివస్ రన్ ను నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద జరిగిన కార్యక్రమంలో ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అదనపు డీజీ మహేశ్ భగవత్ తోపాటు ఐపీఎస్ అధికారులు తఫ్సీర్ ఇక్భాల్, జోయల్ డేవిస్, శిల్పవల్లి, అపూర్వ రావు, దార కవిత, లావణ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ ను ఘనంగా నిర్వహించారు. ఆయా జోన్ల డీసీపీలు దీనికి నేతృత్వం వహించారు. మాదాపూర్ జోన్ లో టీ హబ్ గేటు నుంచి మొదలైన ఈ రన్ రెండు కిలోమీటర్ల దూరం సాగింది. ఈ సందర్భంగా డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ అఖండ భారతదేశం ఏర్పాటులో సర్ధార్ వల్లబ్ భాయ్ వహించిన పాత్ర మరవ లేనిదని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ బుక్ రికార్డ్స్ ప్రతినిధులు నమోదు చేశారు. మేడ్చల్ జోన్ లో డీసీపీ కోటిరెడ్డి రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఉక్కు సంకల్పానికి ప్రతీక అయిన సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ అందరికీ ఆదర్శనీయుడని చెప్పారు. శంషాబాద్ జోన్ లో నర్కుడలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి మొదలైన రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ 3కిలోమీటర్ల దూరం సాగింది.
విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక బాధ్యత
ఈ సందర్భంగా డీసీపీ రాజేశ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఐక్యత, సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. రాజేంద్రనగర్ జోన్ లో జరిగిన కార్యక్రమంలో డీసీపీ యోగేశ్ గౌతమ్ మాట్లాడుతూ సమిష్టి కృషితోనే శాంతియుతమైన సమాజాన్ని ఏర్పాటు చేయగలుగుతామని చెప్పారు. ప్రతీ ఒక్కరూ…ముఖ్యంగా యువత సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బాలానగర్ జోన్ లో జరిగిన కార్యక్రమంలో కూకట్ పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి మాట్లాడుతూ అందరం ఐకమత్యంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ చూపించిన దారిలో నడిచి ప్రతీ ఒక్కరూ శాంతియుత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు.
రాచకొండ కమిషనరేట్ లో
సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ 150వ జయంతిని రాచకొండ పోలీసులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో కమిషనర్ సుధీర్ బాబు సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు సిబ్బందితో ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 560కి పైగా సంస్థానాలను ఏకం చేసి అఖండ భారత దేశాన్ని ఏర్పాటు చేసిన సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ ఘనత అందరికీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో డీసీపీలు ఇందిర, నరసింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక, ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి క్రికెట్ స్టేడియం వరకు రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ ను జరిపారు. దీంట్లో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అన్విత రెడ్డి, అథ్లెటిక్ కల్పన రెడ్డి పాల్గొన్నారు. రన్ లో డీసీపీ పద్మజ, అరవింద్ బాబు పాలు పంచుకున్నారు.
Also Read: Chiranjeevi: పేరు, ఫొటోల విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి కారణం బాలయ్యేనా?
