Bhatti Vikramarka: దేశాన్ని నడిపించిన వ్యక్తులను సృష్టించిన వర్శిటీ జవహర్ లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ(Jawaharlal Nehru Technical University) అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు(Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్లో విద్య, నైపుణ్యాలు, ఉపాధికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ గ్లోబల్ గ్రోత్ ఇంజన్ కావాలి, ఆ ఇంజన్ ను ముందుకు నడిపేది జేఎన్టీయూనే అని కూడా ఆయన వెల్లడించారు. శుక్రవారం జేఎన్టీయూ డైమండ్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సావనీర్ ను ఆవిష్కరించి, పూర్వ విద్యార్థులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత అరవై ఏళ్లలో లక్షలాది ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిపాలకులు తీర్చిదిద్దిన ఈ పవిత్ర స్థలంలో నిలబడి ప్రసంగించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. జేఎన్టీయూ సంస్థకు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరు ఉండడం ఎంతో సార్థకమైందని అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్తు విజ్ఞానం, ఆధునిక సంస్థలు, యువత ధైర్యంపై నిర్మితమవుతుందని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విశ్వసించేవారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాలు దేశ పురోగతికి ఇంజన్గా మారాలని ఆనాడే నెహ్రూ కలగన్నారని అన్నారు.
దేశ చరిత్రలో..
1965లో నాగార్జునసాగర్ ఇంజనీరింగ్ కాలేజ్గా ప్రారంభమై, 1972లో దేశ మొదటి సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఎదిగి, నేడు వంద ఎకరాల కూకట్పల్లి క్యాంపస్గా జేఎన్టీయూ ప్రపంచ ఖ్యాతిని పొందిందన్నారు. జేఎన్టీయూ అనేక విజయాలను సాధించిందని వివరించారు. గన్ఫౌండ్రీ, మసాబ్ ట్యాంక్ నుండి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ, క్వాంటమ్ టెక్నాలజీ, గ్లోబల్ ఇన్నోవేషన్ వరకు జేఎన్టీయూ ప్రస్థానం దేశ చరిత్రలో లిఖించదగిన గొప్ప అధ్యాయనమన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం జేఎన్టీయూ కి సంబంధించిన ప్రస్థానాన్ని ఒక సామెత ద్వారా వివరించారు.“సిలికాన్ వాలీలో ఒక రాయి విసిరితే అది ఐఐటీఐఎన్ లేదా జేఎన్టీయూ అలుమ్ని మీద పడుతుంది.” సర్కార్ ప్రతినిధిగా నేను రాళ్లు విసరమని చెప్పలేను, కానీ ఆ గణాంకం మాత్రం వాస్తవమని జేఎన్టీయూ విద్యార్థుల ప్రస్థానం గురించి ఛలోక్తులు విసురుతూ సభికులను నవ్వించారు.
ఒక జాతీయ ఆస్తి..
ఇస్రో నుండి గూగుల్ వరకు, డీఆర్డీఓ నుండి టెస్లా వరకు, పబ్లిక్ సెక్టార్ నాయకత్వం నుండి డీప్-టెక్ స్టార్టప్ల వరకు జేఎన్టీయూ భారతదేశాన్ని ముందుకు నడిపించిన తరాలను సృష్టించిందని డిప్యూటీ సీఎం వివరించారు. జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల జాబితాను ఒకసారి పరిశీలిస్తే అలుమ్నీ జాబితా ఒక హాల్-ఆఫ్-ఫేమ్ మాదిరిగా ఉందన్నారు. డా. జి. సతీష్ రెడ్డి, డా. టెస్సీ థామస్,డా. అవినాష్ చంద్రా, మహేందర్ రెడ్డి లతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వాములవుతున్న వేలాది ఇంజనీర్లు ఇక్కడి వారేనని డిప్యూటీ సీఎం వివరించారు. జేఎన్టీయూ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదని ఒక జాతీయ ఆస్తి అని ఆయన అభివర్ణించారు. జేఎన్టీయూ ఎల్లప్పుడూ తెలంగాణకు బలమైన భాగస్వామి అని, నిజాయితీతో ప్రవేశ పరీక్షలు, అనుబంధ కాలేజీలకు నైతిక మార్గనిర్దేశం, రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ హబ్గా మార్చే ప్రభుత్వ లక్ష్యానికి అపూర్వ సహకారం అందిస్తుందన్నారు. ప్రస్తుతం 215 కాలేజీలు, 3.5 లక్షల మంది విద్యార్థులు జేఎన్టీయూ కుటుంబంలో భాగం కావటం దాని ప్రభావం, వ్యాప్తిని తెలియజేస్తుందన్నారు. ప్రతి వర్షాకాలంలో మేము మరమ్మతు చేసే గుంతల కంటే ఎక్కువ ఇంజనీర్లను జేఎన్టీయూ తయారు చేసిందన్నారు.
Also Read: CAongress Party: కాంగ్రెస్లో ప్లెక్సీల లొల్లి.. నేతల పరువు తీసిన క్యాడర్.. వినూత్న రీతిలో నిరసన
ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్యా రంగ పునర్నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం రిక్రూట్ మెంట్ పరీక్షలో నమ్మకాన్ని, పారదర్శకతను, గౌరవాన్ని పునరుద్ధరించామన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో టెక్నికల్ ఎడ్యుకేషన్ ను ఆధునికీకరిస్తున్నామని, ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, ఇండస్ట్రీ 4.0 యుగానికి యువతను సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. 5 ఐటీఐ లను ఇప్పటికే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని, రాష్ట్రంలో మొత్తం 104 ఐటీఐ లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జేఎన్టీయూకు సరి సమానంగా భారత్ స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. విద్యకు వెచ్చించేది ఖర్చు కాదని అది భవిష్యత్తు మీద పెట్టుబడిగా ఆయన వివరించారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరణ
జేఎన్టీయూ భూమి లీజ్ సమస్య పరిష్కారం, లీజ్ రెంట్, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరణకు రూ. 800 కోట్లు కేటాయించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు. ఉద్యోగం కోరే వారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించే వారిగా ఎదగండి, ఇంజనీరింగ్లో సమయాన్ని సెమిస్టర్లలో కొలుస్తారని, ఒత్తిడిని బ్యాక్లాగ్లలో కొలుస్తారని నాకు తెలుసన్నారు. కానీ మార్కుల కంటే ముఖ్యమైనది ఆసక్తి, ధైర్యమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. 2027 నాటికి భారతదేశంలో 1000 ప్లస్ యూనికోర్న్ స్టార్టప్లు ఎదగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ విప్లవానికి ప్రధాన కేంద్రంగా మారేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమైందన్నారు. చెడువ్యసనాలకు దూరంగా, పుస్తకాలు, ల్యాబ్లు, మెంటర్లు, అవకాశాలకు దగ్గరగా ఉండాలని విద్యార్థులకు ప్రేమ పూర్వక సలహాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో, ఈ దేశాన్ని ముందుకు నడిపించటంలో ముందుండే ఒక గొప్ప సంస్థను నిర్మించినందుకు అధ్యాపక వర్గానికి, పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. సాహసంగా కలలు కనాలని, వినయంతో సమాజానికి సేవ చేయాలని డిప్యూటీ సీఎం విద్యార్థులకు సూచించారు.మొదటి 60 ఏళ్ల కంటే రానున్న 60 సంవత్సరాలు మరింత మహోన్నతంగా జేఎన్టీయూ ఆయన ఆకాంక్షించారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, యూనివర్సిటీ రెక్టార్ విజయ్ కుమార్, రిజిస్టర్ కే.వెంకటేశ్వరరావు, ఉన్నతాధికారులు కృష్ణ ఆదిత్య, గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Nizamabad Crime: స్నేహం పేరుతో ఇంట్లోకి వచ్చి.. పరిచయం పెంచుకుని ప్రమాదం తెచ్చిన మహిళ!

