Drug Bust: డెలివరీ బాయ్స్ గా పని చేస్తూ తేలికగా డబ్బు సంపాదించటానికి అడిగిన వారికి గంజాయి అమ్ముతున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మంతోపాటు కర్ణాటక, ఒడిషా రాష్ట్రాలకు చెందిన శ్రీకాంత్, కిశోర్, ఉమేశ్ కుమార్, సయ్యద్ అన్వర్, సింహాచలరావు, అమర్, జోయ అలీ, మహ్మద్ అలీ, ఇర్పాన్, బాబుల్ పురి కొంతకాలం క్రితం ఉపాధిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు.
హోటళ్లలో ఉద్యోగులు
కొందరు డెలివరీ బాయ్స్ గా పని చేస్తుండగామరికొందరు హోటళ్లలో ఉద్యోగులుగా చేరారు. ఈ క్రమంలో ఒకరికొకరితో పరిచయాలు ఏర్పడ్డాయి. వీరందరికీ గంజాయి సేవించే అలవాటు ఉండటంతో తరచూ కలుసుకునే వారు. కాగా, చేస్తున్న పనుల్లో ఆశించినంత ఆదాయం రాకపోతుండటంతో అంతా కలిసి గంజాయి దందా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం బీదర్, ఒడిషా నుంచి గంజాయి కొని తెచ్చి మాదాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో అడిగిన వారికి అమ్ముతూ వస్తున్నారు.
Also Read: Amberpet Drug Bust: భారీగా గంజాయి డ్రగ్స్ సీజ్.. ఎక్సయిజ్ సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నం!
ఆహార పదార్థాలను డెలివరీ
ఈ మేరకు పక్కాగా సమాచారాన్ని సేకరించిన ఎక్సయిజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏ టీం లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి గ్యాంగులోని శ్రీకాంత్, కిశోర్, ఉమేశ్ కుమార్, సయ్యద్ అన్వర్, సింహాచలరావు, అమర్ లను బంజారాహిల్స్ లోని ఎస్ఎస్ కాంప్లెక్స్ సర్వీస్ అపార్ట్ మెంట్ నుంచి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగితా నిందతుల కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను బంజారాహిల్స్ ఎక్సయిజ్ పోలీసులకు అప్పగించారు. కాగా, సరుకులు, ఆహార పదార్థాలను డెలివరీ చేస్తున్న కంపెనీలకు లేఖలు రాయాలని ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం సిబ్బందికి సూచించారు. డెలివరీ బాయ్స్ గా పని చేస్తున్న వారిపై ఆయా కంపెనీలు కన్నేసి పెట్టాలని వారికి చెప్పాలన్నారు. ఎవరైనా గంజాయి, ఇతర డ్రగ్స్ తో కనిపిస్తే వెంటనే సమాచారం పంపించేలా చూడాలని పేర్కొన్నారు.
Also Read: Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

