Hydraa: హైదరాబాద్ మాదాపూర్ లోని జూబ్లీ ఎన్క్లేవ్లో పార్కులతో పాటు రహదారుల ఆక్రమణలను గురువారం హైడ్రా తొలగించింది. 22.20 ఎకరాలలో దాదాపు 100 ప్లాట్లతో అనుమతి పొందిన ఈ లే ఔట్లో 4 పార్కులుండగా 2 కబ్జా(దాదాపు 8 వేల 500 గజాలు)కు గురయ్యాయి. అలాగే 5 వేల గజాల మేర రోడ్డు కూడా కబ్జా అయ్యింది. వీటికి తోడు.. దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా వెలిసిన హోటల్ షెడ్డును కూడా హైడ్రా తొలగించింది. ఇలా మొత్తం 16,000 గజాల స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా తెలిపింది. దీని విలువ దాదాపు రూ. 400ల కోట్ల వరకు ఉంటుందని పేర్కొంది.
ప్రజావాణిలో ఫిర్యాదు ఆధారంగా..
1995లో అనుమతి పొందిన ఈ లే ఔట్ ను 2006లో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఈ లే ఔట్ ప్రకారం GHMCకి గిఫ్ట్ డీడ్ చేసిన పార్కులను జైహింద్రెడ్డి అనే వ్యక్తి కబ్జా చేశారంటూ జూబ్లీ ఎన్క్లేవ్ లే ఔట్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై క్షేత్రస్థాయిలో విచారించిన హైడ్రా అధికారులు కబ్జాలు వాస్తవమే అని నిర్ధారించుకున్నారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు వాటిని గురువారం తొలగించారు. హైడ్రా ACP శ్రీకాంత్, ఇన్ స్పెక్టర్లు నేతృత్వంలో ఈ కూల్చివేతలు జరిగాయి. వెనువెంటనే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు సూచిస్తూ బోర్డులు కూడా పెట్టారు. పార్కులు, ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. కబ్జాకు పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు కూడా పెడుతున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు.
4 చోట్ల ఆక్రమణల తొలగింపు ..
లే ఔట్ ప్రకారం ఉన్న 4 పార్కుల్లో 2 పార్కులు, ఒక రహదారి, ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్టు వెల్లడి కావడంతోనే గురువారం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా తెలిపింది. హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ రహదారికి ఆనుకొని మెటల్ చార్మినార్ కు ఎదురుగా దాదాపు 300ల గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి.. అనుమతి లేకుండా జై హింద్ రెడ్డి హోటల్ నిర్మించారని ఫిర్యాదు దారులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. వాటికి సంబంధించిన అద్దెలను కూడా అతడు పొందుతున్నాడని ఆరోపించారు. అదే స్థలంలో భారీ ప్రకటనల హోర్డింగ్ కూడా పెట్టి రెండింటి ద్వారా నెలకు రూ. 4 లక్షల వరకూ ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో హోటల్ను నిర్మించి అద్దె వసూలు చేస్తున్న వైనంపై గతంలో జీహెచ్ ఎంసీ నోటీసులు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: Smart Parking System: హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. స్మార్ట్ పార్కింగ్కు ప్రణాళికలు సిద్ధం!
ఫిర్యాదు దారులు ఏమన్నారంటే?
2006లో రెగ్యులరైజ్ అయిన లే ఔట్ అక్కడి ప్లాట్ యజమానులకు తెలియకుండా తర్వాత ఎలా రద్దవుతుందని ఫిర్యాదు దారులు వాపోయారు. యూఎల్సీ ల్యాండ్ అయితే ప్రభుత్వానికి చెందుతుందని.. మధ్యలో జైహింద్రెడ్డిది ఎలా అవుతుందని ఎన్క్లేవ్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జైహిద్రెడ్డిపై చాలావరకు ల్యాండ్ గ్రాబింగ్ కేసులున్నాయని.. ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. పార్కులను కాపాడిన హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టూ ఐటీ కార్యాలయాలు, నివాసాలు ఉన్న ప్రాంతంలో పార్కులను కాపాడి.. ఇక్కడివారికి హైడ్రా ఊపిరి అందించిందని పేర్కొన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్రెడ్డి గారితో పాటు.. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలను కాపాడుతున్న హైడ్రా ఉద్యోగులు వారిని ముందుండి నడిపిస్తున్న కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.