Hydra: రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన దిశగా హైడ్రా తన టాస్క్ ను పూర్తి చేసుకుంటుంది. కబ్జాల పాలైన సర్కారు భూమిని కాపాడేందుకు మరో ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించి నగరం నడి బొడ్డున ఉన్న సుమారు రూ. 110 కోట్ల విలువైన దాదాపు 1.30 ఎకరాల భూమిని కాపాడింది. ఆసిఫ్ నగర్ విలేజ్లోని సర్వే నంబరు 50లోని ఈ భూమిలో అశోక్ సింగ్ ఆక్రమణకు పాల్పడినట్లు హైడ్రా నిర్థారించింది. ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆక్రమణదారుడు అందులో షెడ్డులు వేసి విగ్రహాలను తయారు చేసి విక్రయించే వారికి అద్దెకు ఇచ్చినట్లు గుర్తించారు. గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కుల్సుంపురలోని ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇటీవలే హైడాను కోరింది.
Also Read: Hydra: బంజారాహిల్స్లో రూ.750 కోట్ల.. ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
ఈ భూమిని కాపాడాలని ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు
ఈ భూమికి కబ్జాల నుంచి విముక్తి కల్గించి, ప్రజావసరాల కోసం వినియోగించాలని సర్కారు భావిస్తున్నట్లు కలెక్టర్ తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం గజం స్థలం కూడా లభ్యం కాని కుల్సుంపురాలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వమున్నట్లు తెలిసింది. ఈ భూమిని కాపాడాలని ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదు వచ్చినట్లు కూడా హైడ్రా వెల్లడించింది. కలెక్టర్ ను లేఖ, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా తొలుత రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలనలు జరిపి, రికార్డులను వెరిఫై చేసి, ఆ భూమి ప్రభుత్వానిదేనని, ముమ్మాటికి ఆక్రమణదారులు అక్రమంగా తిష్ట వేశారన్న విషయాన్ని టెక్నికల్ గా ఖరారు చేసుకున్న తర్వాతే హైడ్రా రంగంలోకి దిగినట్లు సమాచారం. హైడ్రా కమిషనర్ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు హైడ్రా శుక్రవారం ఆక్రమణలను తొలగించింది.
భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్గా కూడా కేసులు నమోదు
ఇంకా ఈ భూమి తనదిగా పేర్కొంటూ అశోక్ సింగ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పినట్లు సమాచారం. ఈ భూమిలో వెలిసిన ఆక్రమణలను ఇప్పటికే రెండుసార్లు రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ స్థలాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేసిన అధికారులపై అశోక్ సింగ్ దాడుకు కూడా పాల్పడిన ఘటనలున్నట్లు హైడ్రా వెల్లడించింది. అశోక్ సింగ్పై వివిధ పోలీసు స్టేషన్లలో భూ కబ్జాదారుడుగా, రౌడీ షీటర్గా కూడా కేసులు నమోదైనట్లు, లంగర్హౌజ్ , మంగల్ హాట్, షాయినాయత్గంజ్ పోలీసు స్టేషన్ లలో అశోక్ సింగ్పై 8కి పైగా కేసులున్నట్లు హైడ్రా వెల్లడించింది. హైడ్రా కాపాడిన 1.30 ఎకరాల భూమిని ఆనుకుని ఉన్న భూమిలో ఇప్పటికే ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా, తాజాగా కాపాడిన ఈ భూమిని కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. ఆక్రమణలను తొలగించిన హైడా, చుట్టూ ఫెన్సింగ్ చేసి, ఈ భూమి ప్రభుత్వానికి చెందినదిగా బోర్డును కూడా ఏర్పాటు చేసింది.
Also Raad: Hydra: మరో రూ. 139 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
