Hydra: మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నెంబరు 25/2 లోని 38 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసింది. గతంలో భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జేఎన్ జేఎంసీహెచ్ ఎస్ )కి రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఈ భూమిని కేటాయించింది. ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ హెచ్ఎండీఏ కస్టడీలో ప్రభుత్వం ఉంచిన విషయం విధితమే. ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడంతో అక్కడ జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ జరగలేదు. కోర్టులో వివాదం ఉండగానే మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రాకు జేఎన్ జేఎంసీహెచ్ ఎస్ ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు.
Also Read: Hydra Commissioner: అమీర్పేట ముంపునకు హైడ్రా పరిష్కారం.. పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్!
ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం
ఇదే విషయమై అక్కడ రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్ ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించింది. ఇప్పటికే కొంతమంది ఇళ్లు కట్టుకుని ఉండగా, వాటి జోలికి వెళ్లకుండా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ హైడ్రా బుధవారం ఫెన్సింగ్ వేసింది. ఈ విషయమై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా, కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈ లోగా అక్రమణలు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఈ సమావేశంలో హైడ్రా, రెవెన్యూ, హెచ్ ఎండీఏ, మున్సిపల్ అధికారులు కూడా ఉంటారని హైడ్రా వెల్లడించింది.
Also Read: Hydra: గోషామహల్ నియోజకవర్గంలో.. రూ. 110 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా!
